ఎన్నికల్లో పోటీకి పేర్ని నాని దూరం - వైసీపీలోనే కొనసాగేనా : సీఎం జగన్ ఏం చెప్పారు..!!
వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయటం లేదా. వైసీపీలోనే ఉంటారా. ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో పేర్ని నాని ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. మంత్రిగా పని చేసిన సమయంలో ఆయన అటు ప్రభుత్వం..ఇటు పార్టీ తరపున ప్రధాన వాయిస్ వినిపించే నేతగా వ్యవహరించారు. కానీ, మంత్రి పదవి నుంచి తొలిగించిన తరువాత ఆయన పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ, తాజాగా.. మచిలీపట్నం ప్లీనరీ వేదికగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. పేర్నినాని తండ్రి పేర్ని క్రిష్ణమూర్తి సైతం కాంగ్రెస్ నేతగా ఉండేవారు. ఆయన నేదురుమల్లి జానర్ధన రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేసారు.

జగన కు వీర విధేయుడిగా
1999 ఎన్నికల్లో పేర్ని నాని తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసారు. 2004 లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పేర్ని నాని అసెంబ్లీలో విప్ గా వ్యవహరించారు. ఆ తరువాత జగన్ కు దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నేత కొల్లు రవీంద్ర చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నాని మరోసారి గెలిచి..జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేయటం.. చంద్రబాబును టార్గెట్ చేయటంలో ఆయన ముందు నిలిచారు. ఇక, సినిమా టిక్కెట్ల వివాదం - సినీ ఇండస్ట్రీతో సమస్య పరిష్కారంలోనూ కీలకం అయ్యారు. అయితే, కొద్ది రోజుల క్రితం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే పేర్ని నాని పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆ వివాదంలో పేర్ని నాని మౌనం పాటించారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవటం లేదంటూ కొద్ది రోజుల క్రితం ఆయన సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. అందుకు సీఎం జగన్ నో చెప్పారు.

ఎన్నికల్లో పోటీకి దూరంగా
అయినా, తాను పార్టీలోనే కొనసాగుతానని.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని చెప్పినట్లుగా తెలుస్తోంది. తన స్థానంలో తన కుమారుడు క్రిష్ణమూర్తి పోటీకి అవకాశం ఇవ్వాలనేది పేర్ని నాని ఆలోచనగా చెబుతున్నారు. అయితే, సీఎం జగన్ మాత్రం నియోజకవర్గంలో పార్టీ సంగతి చూడాలని... పోటీ ఎవరు చేయాలనేది తరువాత చూద్దామంటూ చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పేర్ని నాని కుమారుడు నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. దీనికి అనుగుణంగానే తాజాగా బందరులో జరిగిన వైసీపీ ప్లీనరీకి హాజరైన కొడాలి నాని మచిలీ పట్నంతో పేర్ని నాని పోటీ చేసినా.. పేర్ని క్రిష్ణమూర్తి పోటీ చేసినా మద్దతుగా నిలవాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో..ఈ వ్యవహారం పైన చర్చ మొదలైంది.
Recommended Video


సీఎం జగన్ ఏం చెప్పారు.. పార్టీలోనే
అయితే, పేర్ని నాని కుమారుడిని బందరు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపితే.. పేర్ని నానిని ఎంపీగా దింపే ఆలోచన సైతం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కానీ, అసలు పోటీకి వెనుకాడుతున్న పేర్ని నాని ఎంపీగా మాత్రం ఎందుకు పోటీ చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలశౌరికి మరో స్థానం కేటాయించే ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. కొందరు సీనియర్ నేతలను ఎంపీలుగా పోటీ చేయించి.. నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చే అంశం పైనా పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అయితే, పేర్ని నాని మాత్రం పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా పని చేయటానికి సిద్దంగా ఉన్నానని చెబుతున్నారు. దీంతో... రానున్న ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేస్తారా.. లేక, పార్టీలో ఏ బాధ్యతల్లో కొనసాగుతారనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. పేర్ని నాని ప్రతిపాదన పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications