పెట్రోల్ బంకులు 12 గంటలే తెరిచి ఉంటాయి, కారణమిదే!
ఈ ఏడాది మే 15వ, తేది నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకే పెట్రోల్ బంకులను తెరిచి ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ చెప్పారు.
అమరావతి: ఈ ఏడాది మే 15వ, తేది నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకే పెట్రోల్ బంకులను తెరిచి ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ చెప్పారు.
తమ డిమాండ్ల సాధన కోసం మే 15 నుండి 12 గంటలపాటే బంకులను నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినా మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన చెప్పారు.
మే 10న, అన్ని చములురు కంపెనీల నుండి పెట్రోల్ ,డీజీలు కొనుగోళ్ళను నిలిపివేయనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగానే ఇంధన పొదుపులో భాగంగా మే 14వ, తేదిన బంకులను పూర్తిగా మూసివేస్తామని ప్రకటించారు.
పెట్రోల్ లీటరుకు రూ.3.33, డీజీల్ కు రూ.2.30 చొప్పు కమీషన్ ఉంటే కానీ, బంకులు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. గత మార్చి నెలలో సమ్మె చేసిన సమయంలో కమీషన్లు పెంచుతామని లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.2.59, డీజీల్ కు రూ.1.63 కమీషన్ ను చెల్లిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
2011లో అపూర్వచంద్ర కమిటీ ఇచ్చిన సిఫారసులను పట్టించుకోకుండా విచ్చలవిడిగా కొత్త బంకులకు అనుమతులను మంజూరుచేస్తున్నారని చెప్పారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు కమీషన్లు కూడ పెంచలేదన్నారు. అపూర్వ కమిటీ సిఫారసుల మేరకు నెలకు 1.70 లక్షల కిలోలీటర్ల విక్రయిస్తే కానీ, బంకుల నిర్వహణ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం సగటున నెలకు 1.40 లక్షల కిలోలీటర్లకు మించి విక్రయాలు జరగడం లేదన్నారు.