Kuppam Petrol Price : చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్ ధర
దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో సామాన్య,మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలాచోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటింది. తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని కుప్పం కూడా చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో పెట్రోల్ ధర ఇంత భారీ స్థాయిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
కుప్పంలోనే ఎందుకిలా...
రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 106.80 ఉండగా.. విజయవాడలో రూ.107.63గా ఉంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోల్ రూ.108.92గా ఉంది. అయితే మిగతా నగరాల కంటే కుప్పంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం... స్టోరేజీ కేంద్రాల నుంచి కుప్పం నియోజకవర్గం దూరంలో ఉండటమేనని చెబుతున్నారు. రవాణా ఛార్జీల భారం ఎక్కువగా ఉండటంతో పెట్రోల్ ధరలపై అది ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. పక్క పక్కనే ఉండే గుంటూరు విజయవాడల్లోనూ పెట్రోల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.
బెంగాల్,రాజస్తాన్లలో ఇప్పటికే ఆ మార్క్...
దేశవ్యాప్తంగా మే 4వ తేదీ నుంచి పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్,రాజస్తాన్లలో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.110కి చేరింది. చమురు కంపెనీలు నిత్యం ధరలను సమీక్షిస్తుండటంతో ఎప్పటికప్పుడు పెరుగుదల నమోదవుతోంది. శనివారం(జులై 17) లీటర్ పెట్రోల్పై 30 పైసలు మేర పెరగ్గా... ఆదివారం(జులై 18) మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది.
సామాన్యుల గగ్గోలు
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు,వంట గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. పెట్రోల్ రేట్లు కూడా రోజురోజకు పెరుగుతుండటంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యులు బతకడం కష్టంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసందే. బీజేపీ మాత్రం ధరల పెంపుకు కాంగ్రెసే కారణమని చెబుతోంది. కాంగ్రెస్ హయాంలో చమురు కంపెనీలకు బాండ్లు జారీ చేయడం వల్ల... అసలు,వడ్డీ రూపంలో కేంద్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది.