దిశను మార్చిన లెహర్: ఆర్కె బీచ్లో సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న లెహర్ తుఫాను తన దిశను మార్చుకుంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం పోర్టు బ్లెయిర్కు పశ్చిమ - వాయువ్య దిశలో 650, మచిలీపట్నంకు తూర్పు ఆగ్నేయ దిశలో 700, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశలో 640, కళింగపట్నానికి ఆగ్నేయ దిశలో 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ లెహర్ తుఫాను గురువారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. లెహర్ నెమ్మదిగా దిశ మార్చుకుని నెల్లూరు - చెన్నై మధ్య తీరాన్ని తాకే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషకులు ముందే అభిప్రాయపడ్డారు. తూర్పు వాయవ్యంగా దీని గమనాన్ని మార్చుకుని నెల్లూరు, చెన్నైలపై ప్రభావాన్ని చూపే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
లెహర్ ప్రభావం ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ బుధవారం మధ్యాహ్నం నుంచి ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. బుధవారం మధ్యాహ్నానికి తీరం వెంబడి 45నుంచి 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం మరింత ఉద్ధృతమై తీరం తాకే సమయానికి గంటకు 170 నుంచి 200 కిమీ వేగంతో తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఉత్తరకోస్తా, యానాం, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.

లెహర్ 1
లెహర్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో పాటు పెనుగాలులు వీస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయమేర్పడే అవకాశం ఉంది.

లెహర్ 2
ఇప్పటికే వాహనాల నియంత్రణపై రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలకు స్పష్టమైన ఆదేశాలందాయి. లెహర్ ప్రభావం కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, దక్షిణ ఒడిశాలపై పడనుంది. లెహర్ తుఫాను కారణంగా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విశాఖ ఆర్కె బీచ్ వద్దకు జనం తరలి వచ్చారు.

లెహర్ 3
లెహర్ తుఫాన్ ఉద్ధృతమైన సమయంలో కోస్తా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. లెహర్ నేపథ్యంలో ఆర్కె బీచ్ వద్ద సముద్రం దృశ్యం.

లెహర్ 4
తీరంలో సముద్రపు అలలు 2 నుంచి 3మీటర్ల వరకూ ఎగసిపడనున్నాయి. దీనివల్ల తీరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

లెహర్ 5
లెహర్ తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. లెహర్ ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది.

లెహర్ 6
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు శెలవు ప్రకటించారు. గురువారం కూడా పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

లెహర్ 7
తూర్పు జిల్లా కేంద్రం కాకినాడ తీర రేఖ వెంబడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 28న మధ్యాహ్నం కాకినాడ సమీపంలో లెహర్ తీరం దాటనుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

లెహర్ 8
బుధవారం నుండి తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో ప్రజలు బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించరాదంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరించారు.

లెహర్ 9
లంక, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇండియన్ కోస్ట్గార్డ్, మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో తీరంలో ప్రత్యేక బృందాలను రక్షణ కోసం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications