మళ్లీ మెట్రో పరుగు ఇలా.., నాలుగైదుసార్లు (పిక్చర్స్)
హైదరాబాద్: ఎల్ అండ్ టీ ఇంజనీర్లు మెట్రో రైలు ట్రయల్ రన్ రెండో రోజూ కొనసాగించారు. నాగోల్ - మెట్టుగూడ కారిడార్లో మెట్రో రైలు దూసుకుని వెళ్తుంటే స్థానికులు ఆశ్చర్యంతో చూశారు.
ఆయా కూడళ్ల వద్ద వాహనాలపై వెళుతున్న ప్రయాణికులు రోడ్డుపై ఆగి మరీ మెట్రో పరుగును పరిశీలించారు. మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెడుతుంటే ప్రజలు పోటీ పడి మరీ చూడటానికి వచ్చారు.
మెట్రో ట్రయల్ రన్ జరుగుతున్న విషయం తెలుసుకుని పరిసర ప్రాంతాల ప్రజలతో పాటూ చుట్టుపక్కన ఉన్న సికింద్రాబాద్, ముషీరాబాద్, తార్నాక, హబ్సీగూడ, అంబర్పేట, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్ తదితర ప్రాంతాల ప్రజలు మెట్రో రైలును చూడటానికి వచ్చారు.
మెట్రో రైలు
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రైలు కూత శబ్దం వినిపించింది... వెంటనే ట్రెయిన్ వస్తుందని ఫుట్పాత్ వ్యాపారులు, ప్రయాణికులు తమ దృష్టిని ఫ్లై ఓవర్ వైపు మరల్చారు.
మెట్రో రైలు
అంతలోనే రైలు ఉప్పల్ డిపో వైపు నుంచి వచ్చి హబ్సిగూడ వైపు వెళ్ళింది. మరో పది నిమిషాల్లో తిరిగి ఉప్పల్ డిపోకు చేరుకుంది. ఇలా ఉప్పల్ డిపో హబ్సిగూడ మెట్రోరైల్ స్టేషన్ మధ్య నాలుగు చక్కర్లు కొట్టింది.
మెట్రో రైలు
మెట్రో వయడక్టుపై హైదరాబాద్ మెట్రోరైలు టెస్ట్రన్ విజయవంతంగా జరిగింది. రోలింగ్ స్టాక్/రైలు రెండింటికి సంబంధించి నిలకడగా ఉన్నప్పుడు, రన్నింగ్ పరిస్థితిలోను ఇంకా అనేక పరీక్షలు చేయాల్సి ఉంది. ఇవి అటు డిపోలోను, ఇటు వయడక్టు మీద కూడా సాగుతాయి. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఆ తర్వాతే సంబంధిత అధికారులు సేఫ్టీ/ అప్రూవల్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
మెట్రో రైలు
ఆ తర్వాత ట్రయల్ రన్ మొదలవుతుంది. టెస్ట్రన్, ట్రయల్ రన్ రెండూ వేర్వేరు. ట్రయల్రన్లో ఒకేసారి టైంటేబుల్ ప్రకారం వేర్వేరు రైళ్లను ప్రయోగాత్మకంగా నడుపుతారు. షెడ్యూలు ప్రకారం అన్నీ నడుస్తున్నాయా, సరైన సమయంలోనే గమ్యం చేరుకుంటున్నాయా అనే విషయాలను 60 రోజుల పాటు(బర్నింగ్ పీరియడ్) పరీక్షిస్తారు.
మెట్రో రైలు
అప్పుడు మొత్తం వ్యవస్థను స్థిరీకరించేందుకు రామ్స్(రిలయబులిటీ, అవైలబులిటీ, మెయింటైనబులిటీ, సేఫ్టీ) లక్ష్యాన్ని పరిశీలిస్తారు.