సిటీలో జగన్ ఒక్కరే!: వారి స్పీచ్, రోజాకు నో (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని హైదరాబాదులో సమైక్య శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించిన రాజకీయ నాయకుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి! ఇంతకుముందు ఎపిఎన్జీవోలు సభను నిర్వహించారు.
రాజకీయ నాయకులు మాత్రం సమైక్యం పేరిట బహిరంగ సభలు మాత్రం నిర్వహించలేదు. దీంతో జగన్ సభపై అందరిలోను ఉత్కంఠ ఏర్పడింది. స్వల్ప సంఘటనలు మినహా జగన్ సభ విజయవంతమైంది. సభలో జగన్ ఢిల్లీ గద్దెను బద్దలు కొడదామని హెచ్చరించారు. అదే సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన నిప్పులు చెరిగారు.
సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు దాడి వీరభద్ర రావు, గట్టు రామచంద్ర రావు, గోపాల్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, కిషోర్ కుమార్, లక్ష్మీ పార్వతి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొడాలి నాని, నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రెహ్మాన్, శోభా నాగి రెడ్డి, ఎస్పీవై రెడ్డి, విశ్వరూప్ తదితరులు మాట్లాడారు. రోజాకు మాట్లాడే అవకాశం రాలేదు. అయితే తనకు మాట్లాడే అవకాశం రానందుకు తానేమీ బాధపడటం లేదని రోజా చెప్పారు.
దాడి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేయడానికి చంద్రబాబు ముందుకు రావాలని, పిసిసి కూడా తీర్మానం చేయాలని దాడి వీరభద్ర రావు అన్నారు.
గట్టు
రాష్ట్రంలో జరుగుతోంది రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ కాదని, రెండు వాదనల మధ్య ఘర్షణ అని, సమైక్యాంధ్ర రాష్ట్రానికే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని గట్టు రామచంద్ర రావు అన్నారు.
గోపాల్ రెడ్డి
విభజన జరిగితే దశి దిశ ఉండదని, హైదరాబాదు నగరం తమదని భావించే కోస్తాలో ఎకరాలు అమ్ముకొని నగరంలో గజాల స్థలం కొనుక్కొని సీమాంధ్ర ప్రజలు అభివృద్ధి చేశారని ఎపిఎన్జీవో నేత గోపాల్ రెడ్డి అన్నారు.
జూపూడి
ఢిల్లీ పీఠానికి జగన్ తుఫాు ఇప్పుడు తాకిందని, ఆ తుఫానులో కొట్టుకుపోయేందుకు వారు సిద్ధంగా ఉండాలని జూపూడి ప్రభాకర రావు నిప్పులు చెరిగారు.
కిషోర్ కుమార్
రాష్ట్రం విడిపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర నిర్ణయాన్ని విద్యార్థులం స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర జెఏసి నేత కిషోర్ కుమార్ అన్నారు.
లక్ష్మీ పార్వతి
స్వర్గీయ నందమూరి తారక రామారాను, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిల ఆశయాలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి
చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆయనను జాతి క్షమించదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
నల్లా సూర్యప్రకాశ్
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ ప్రజలు కూడా బాగా లబ్ధి పొందుతారని నల్లా సూర్యప్రకాశ్ అన్నారు.
కొడాలి నాని
చంద్రబాబు గజినీ అని, ఆయన అన్ని మర్చిపోతాడని, విబజన ప్రక్రియకు ఆజ్యం పోసిన దుర్మార్గుడు ఆయనేనని కొడాలి నాని ధ్వజమెత్తారు.
పిల్లి సుభాష్
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, సమైక్యాంధ్రకే తమ పార్టీ కట్టుబడి ఉందని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
రెహ్మాన్
హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదని అందరి సొత్తని, చంద్రబాబుకు దశ, దిశలు లేవని, రాష్ట్రంలో దీక్ష చేస్తే రాళ్లతో కొడతారనే ఢిల్లీలో చేశారని రెహ్మాన్ ఎద్దేవా చేశారు.
శోభా నాగి రెడ్డి
సోనియా గాంధీని జగన్ ఒక్కరే ఎదిరించారని, తమ పార్టీ సమైక్యాంధ్ర కోసం చివరిదాకా పోరాటం చేస్తుందని శోభా నాగి రెడ్డి అన్నారు.
విశ్వరూప్
విభజన వల్ల తలెత్తే సమస్యలేమిటో తెలుసు కాబట్టే రాష్ట్ర సమైక్యత కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని పినిపె విశ్వరూప్ అన్నారు.
రోజా
ప్రముఖ నటి రోజాకు సమైక్య శంఖారావం బహిరంగ సభలో మాట్లాడే అవకాశం రాలేదు. అయితే అందుకు తానేమీ బాధపడటం లేదని ఆమె చెప్పారు.