బాబాయే: ముగ్గురు చిన్నారుల దారుణ హత్య (పిక్చర్స్)
నిజామాబాద్: జిల్లాలో బాబాయే పిల్లలకు ఐస్ క్రీం తినిపిస్తానని తీసుకెళ్లి హత్య చేసిన విషయం తెలిసిందే. తండ్రిలా కాపాడాల్సిన బాబాయే కాలయముడయ్యాడు. బంధాలు బాంధవ్యాలను మరచి మృగంలా మారాడు. సొంత బాబాయే సైకోలా మారి అతి కిరాతకంగా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాడు.
జిల్లా డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన రఘుపతి రెడ్డికి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు గంగారెడ్డి హైదరాబాద్లో రిలయన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, రెండో కొడుకు సాయిరెడ్డి కాంట్రాక్టర్గా స్థిరపడ్డారు.
మూడో కొడుకు రాజారెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. రఘుపతి రెడ్డి భార్య అక్క కొడుకులు రాజిరెడ్డి, నరేందర్రెడ్డి కూడా రఘుపతి రెడ్డి వద్దే పెరిగారు. బుధవారం గంగాస్థాన్లో బంధువుల పెళ్లి ఉండటంతో హైదరాబాద్లోని గంగారెడ్డి, రాజారెడ్డి కుటుంబసమేతంగా గంగాస్థాన్ వచ్చారు.
చిన్నారులు 1
బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో గంగారెడ్డి కూతురు సిరి(9), సాయిరెడ్డి కూతురు అక్షయ (7), రాజారెడ్డి కూతురు ఖుషి(6)లకు ఐస్క్రీం తినిపిస్తానని చెప్పి బాబాయి నరేందర్ రెడ్డి వారిని కారులో బయటకు తీసుకెళ్లాడు.
చిన్నారులు 2
నిజామాబాద్ మండలం బర్దిపూర్ శివారులో ఐస్క్రీంలో పురుగుల మందు కలిపి చిన్నారులకు తినిపించాడు. అనంతరం చిన్నారులపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత నరేందర్రెడ్డి బుధవారం రాత్రే ఇంటికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బంధువులకు తెలిపాడు.
చిన్నారులు 3
కంగారుపడిన కుటుంబ సభ్యులు పిల్లలు గురించి ఆరాతీసి, వారిని ఏమీ చేయవద్దని ప్రాధేయపడ్డారు. ఫోన్ కట్ చేసిన నరేందర్ రెడ్డి ఆ తర్వాత ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చిన్నారులు 4
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, గురువారం ఉదయం నరేందర్రెడ్డి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరి వంతెన పక్కన అతని కారు, చెప్పులు, వాచీని గుర్తించారు.
చిన్నారులు 5
నరేందర్రెడ్డి అక్కడ లేకపోవడం, పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో పిల్లలను చంపి, తానూ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానంతో గోదావరి నదిలో 20 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
చిన్నారులు 6
అదే సమయంలో స్థానికుల సమాచారంతో బర్దీపూర్ శివారు లో చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. చిన్నారుల మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
చిన్నారులు 7
ఘటనాస్థలాన్ని డిఐజి సూర్యనారాయణ, ఎస్పీ తరుణ్ జోషి, డిఎస్పీ అనిల్ కుమార్ పరిశీలించారు. నరేందర్ రెడ్డి కోసం పోలీసు బలగాలు గాలిస్తున్నాయి.