Pick talk: వైఎస్ జగన్ - చంద్రబాబు: మధ్యలో ఆ ముగ్గురే అడ్డు..!!
అమరావతి/న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 20 దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు కానున్నారు. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఎమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్పింగ్.. సహా వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్లో పాల్గొనడానికి భారత్కు రానున్నారు. వచ్చే ఏడాది ఈ సదస్సు ఏర్పాటు కానుంది.

జీ20 సమ్మిట్ కళ..
వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని వేదికగా ఈ జీ20 సమ్మిట్ జరుగనుంది. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యలుగా కొనసాగుతున్నాయి. ఇటీవలే జీ20 సదస్సు ఇండొనేసియాలోని బాలిలో ముగిసిన విషయం తెలిసిందే.

విజయవంతం చేయడానికి..
ఇన్ని దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు హాజరు కానున్న జీ20 సదస్సును విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్నీ ఏర్పాటు చేసింది. దేశ రాజధానిలో ఈ భేటీ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, సుబ్రహ్మణ్యం జైశంకర్, ప్రహ్లాద్ జోషి, నిర్మల సీతారామన్, పియూష్ గోయెల్, రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు.

రాష్ట్రం నుంచి..
రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, ప్రేమ్ సింగ్ తమాంగ్, ఏక్నాథ్ షిండే, అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా ఇందులో పాల్గొన్నారు.

ఒకే వేదికపై..
ఈ సదస్సులో వైఎస్ జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు. తొలుత వైఎస్ జగన్, సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశ వేదిక రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ప్రధాని మోదీ వారిని సాదరంగా ఆహ్వానించారు. అదే సమయంలో చంద్రబాబు, వివిధ పార్టీలకు చెందిన అధినేతలు అక్కడికి వచ్చారు. చంద్రబాబుతో కొద్దిసేపు మోదీ మాట్లాడారు. అనంతరం వారంతా తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చున్నారు.

కుడివైపున..
కుడి వైపు వరుసలో తొలుత దేవేగౌడ, ఆయన పక్కన జేపీ నడ్డా కూర్చున్నారు. జేపీ నడ్డా పక్క నుంచి వరుసగా ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం పార్టీ నేత కూర్చున్నారు. ఎడమ వైపున తొలుత ముఖ్యమంత్రులు స్టాలిన్, హిమంత బిశ్వ శర్మ, ఏక్నాథ్ షిండే, సీతారాం ఏచూరి, డీ రాజా తదితరులు ఆసీనులయ్యారు. కుడివైపున ఒకే వరుసలో వైఎస్ జగన్- చంద్రబాబు కూర్చోవడం ఆకర్షించింది. వారి మధ్య నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం పార్టీ నేత మాత్రమే ఉన్నారు.












Click it and Unblock the Notifications