ఉత్తమ్ కుమార్ కారు: కోట్ల కట్టలు దగ్ధం ఇలా (పిక్చర్స్)
నల్లగొండ: కారు ఇంజిన్లో పెట్టి తరలిస్తున్న కోట్ల రూపాయల కట్టలు ప్రమాదానికి గురై దగ్ధమయ్యాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎపి 09బిటి 8289 నెంబర్ గల ఇన్నోవా వాహనం పట్టణ శివారులోని జనగాం క్రాస్రోడ్డు వద్దకు చేరుకోగానే ఇంజన్ బాయ్నెట్లోనుంచి మంటలు చెలరేగాయి.
ఇది గమనించిన వాహనంలో వెళ్తున్న వారు రోడ్డు ప్రక్కన ఆపి బాయ్నెట్ పైకెత్తి అందులో తీసుకెళ్తున్న డబ్బుల కట్టలు దగ్ధమవుతున్నట్లు గుర్తించి ఇసుకపోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు రెండుకోట్ల రూపాయాల నగదు గల సంచీని ఇంజన్ బాయ్నెట్లో పెట్టి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఇందులో సుమారు లక్షన్నర నగదు రూ.1000, 500 నోట్ల కట్టలు దగ్ధం కావడంతో వాటిని వాహనం లోపల వేయడం ప్రారంభించారు.
ఈలోగా వారికే చెందినదిగా భావిస్తున్న మరో వాహనం ప్రమాదానికి గురైన ఇన్నోవా వద్దకు వచ్చి ఆగింది. మిగిలిన భారీ నగదును ఇద్దరు వ్యక్తులు ఆ వాహనంలో తీసుకొని పరారయ్యారు. ఇన్నోవా డ్రైవర్ సమీపంలోని కారు షెడ్లో తన వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఈలోగా ఈ విషయం తెలుసుకొని భారీసంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకొని దగ్ధమైన నోట్లను ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు.
ఈ వాహనంపై హుజూర్నగర్ నుండి పోటీచేస్తున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో ఈ నగదు ఆయనకు చెందినదిగా ప్రచారం జరుగుతోంది. కారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన పోటాన్ ఎనర్జీసిస్టమ్ కంపెనీకి చెందినదిగా గుర్తించినట్లు చెబుతున్నారు. కాగా ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ ఆరాతీసి విచారణకు ఆదేశించారు.
డబ్బులు తరలిస్తున్న కారు ఇదే..
ఇంజిన్ బాయ్నెట్లో పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తరలిస్తుండగా కారులో మంటలు లేచాయి. ఆ కారు ఇదే. దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కారుగా అనుమానిస్తున్నారు.
కారును షెడ్లో పెట్టి పరారీ...
కొంత డబ్బును వేరే కారులో వేసుకుని వెళ్లగా, డ్రైవర్ కాలిన తన కారును పక్కన ఉన్న షెడ్లో నిలిపి పరారయ్యాడు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిదిగా అనుమానం..
డబ్బులు తరలిస్తూ కాలిపోయిన కారు హుజూర్నగర్ కాంగ్రెసు అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డిదిగా అనుమానిస్తున్నారు.
కాలిన నోట్లు ఇలా...
కారులో ఐదు వందలు, వేయి రూపాయల నోట్లే కనిపించాయి. మంటలు లేవడంతో ఆ నోట్లు ఇలా కాలిపోయాయి.
బాయ్నెట్లో ఇలా...
ఐదు వందలు, వేయి రూపాయల నోట్లు ఇలా కారు ఇంజిన్ బాయ్నెట్లో మంటలు రేగడంతో కాలిపోయాయి.
డబ్బులంటే లెక్కే లేదా ..
రూ. 1.51 కోట్ల రూపాయలు దగ్ధమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.