ఎన్టీఆర్ వారసత్వానికి చెల్లు చీటి, బాబు వారసత్వమే (పిక్చర్స్)
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వానికి చెల్లుచీటి పాడినట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వారసత్వమే ముందుకు వచ్చినట్లు అర్థమవుతోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు సాధించే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. నిజానికి, పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. పేరుకు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త అయినప్పటికీ నారా లోకేష్ చంద్రబాబు స్థానంలో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను మోస్తున్నట్లు కనిపిస్తున్నారు.
సోమవారం ఆయన కృష్ణా జిల్లా పర్యటన ఈ విషయాన్ని పట్టిస్తోంది. కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు, పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి మధ్య, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కు, మాజీ శాసనసభ్యుడు యలమంచిలి రవికి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అంటున్నారు. నాయకుల మధ్య విభేదాలను తొలగించడానికే ఆయన సోమవారం కృష్ణా జిల్లా పర్యటన చేసినట్లు చెబుతున్నారు. దానికితోడు, పార్టీలోని సీనియర్ నేతలు సైతం నారా లోకేష్ను చంద్రబాబు తర్వాత తమ నాయకుడిగా నారా లోకేష్నే పరిగణిస్తున్నట్లు కూడా అర్థమవుతోంది.
నారా లోకేష్కు ఘన స్వాగతం
సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్కు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మంత్రులు ఘన స్వాగతం పలికారు.
ఇలా పూజలు
సోమవారం ఉదయం కృష్ణా జిల్లాకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నారా లోకేష్కు సన్మానం
సోమవారం కృష్ణా జిల్లాకు వచ్చిన నారా లోకేష్కు ఘనస్వాగతం లభించడమే కాకుండా ఆయన ఘనంగా సన్మానించారు.
ఇలా చేతులు కలుపుతూ..
యువతను లక్ష్యం చేసుకుని పార్టీని విస్తరించే పనిలో లోకేష్ పడ్డారు. ఇందులో భాగంగా ఆయన టిఎన్ఎస్ఎఫ్ను బలోపేతం చేసే పనిలో పడ్డారు. యువత కృష్ణా జిల్లా పర్యటనలో ఆయనతో చేతులు కలపడానికి పోటీ పడింది.
లోకేష్ అభివాదం చేస్తూ..
కృష్ణా జిల్లా పర్యటనలో తనకు లభించిన ఘన స్వాగతం చూసిన లోకేష్ ప్రజలకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేస్తూ ఇలా కనిపించారు.
నేతలకు మార్గదర్శనం
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ పార్టీ నాయకులకు సూచించారు.
నారా లోకేష్ ఇలా ఆవిష్కరణ
నారా లోకేష్ టిఎన్ఎస్ఎఫ్ క్యాలేండర్ను ఆవిష్కరించారు. ఆయనకు కృష్ణా జిల్లాలో ఘనమైన స్వాగతం, ఆదరణ లభించాయి.
ఇలా జ్యోతిని వెలిగిస్తూ..
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ కృష్ణా జిల్లా పర్యటనలో జ్యోతిని వెలిగిస్తూ కనిపించారు. ఆయన చుట్టూ నాయకత్వం తిరుగతోంది.
నాయకులకు సూచన..
కృష్ణా జిల్లా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వెళ్ళేందుకు ఎయిర్ పోర్టుకి వచ్చిన నారా లోకేష్ కొద్దిసేపు లాంజ్రూమ్లో పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు.
నాయకులకు హితబోధ
రుణమాఫీ సక్రమంగా అమలయ్యేలా చూడాలని, పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డువచ్చేలా కృషిచేయాలని నారా లోకేష్ సూచించారు.
ఎన్టీఆర్కు నివాళులు
నారా లోకేష్ తన తాత, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామరావు విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వారసత్వం కూడా తనదేనని చెప్పకనే చెప్పారు.
2019 ఎన్నికల నాటికి..
2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టి, ఎన్నికల్లో పోటీ చేసి తన తండ్రి వారసత్వాన్ని అందుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ప్రజలతో మమేకం..
నారా లోకేష్ ప్రజలతో కలిసిపోయి, వారి కష్టసుఖాలను వినడానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా వారితో ముచ్చటిస్తూ కనిపించారు.
సోమవారం ఉదయం నారా లోకేష్ స్పైస్ జెట్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చినప్పుడు లభించిన స్వాగతం ఆ విషయాన్ని పట్టిస్తుందని చెబుతున్నారు. కృష్ణా జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యేలు, దాసరి బాలవర్థనరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, పార్టీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడు, తెలుగు యువత నాయకులు దేవినేని చంద్రశేఖర్, ఓలుపల్లి మోహనరంగా, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, నాయకులు నాగుల్మీర, రావి వెంకటేశ్వరరావులు ఘన స్వాగతం పలికారు.