తెలుగు ప్రజలను హత్య చేసినట్లు ఉంది: పితాని వ్యాఖ్య
ఏలూరు: కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు ప్రజలను హత్య చేసినట్లే ఉందని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు కృష్ణా నదిపై ఇప్పటికే 32 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఉన్నాయని, ప్రస్తుత తీర్పుతో అవన్నీ వృధా అవుతాయని ఆయన అన్నారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించలేదనే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మాటలో నిజం లేదని ఆయన అన్నారు. నీటి లభ్యతను 65 శాతంగా తీసుకోవడం వల్లనే ఈ విధంగా తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు.
బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల రాష్ట్ర తీవ్రంగా నష్టపోతుందని, తీర్పు ప్రజలను అవమాన పరిచే విధంగా ఉందని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ తీర్పుతో నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు పథకాలకు భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ రెండు ప్రాజెక్లుల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.4,418 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, అయినా మిగులు జలాలపై మన వాదనలను వినిపించకపోవడంతో పరిస్థితి తారుమారైందని ఆయన అన్నారు.