పిఠాపురం ఎమ్మెల్యే కూతురు మృతి: శోకసముద్రంలో ఫ్యామిలీ
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు ఎస్విఎస్ఎన్ వర్మ కూతురు కావ్య (21) ఆకాల మృత్యువాత పడింది. అనారోగ్యం కారణంగా ఆమె మరణించింది. హైదరాబాదులోని ఓ కళాశాలలలో ఇంజనీరింగ్ చదివిన కావ్య బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూతురు అకాల మృత్యుబారిన పడడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అర్థరాత్రి కాకినాడలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కావ్య మరణించింది. వర్మకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
నెల్లూరులోని ఏఎస్ పేట తూర్పువీధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలోని సింగరకొండ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు-లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
విజయవాడ నగరంలోని వన్టౌన్లో ఉన్న గంగానమ్మ ఆలయంలో చోరీ జరిగింది. నాలుగు కిలోల వెండి ఆభరణాలు, హుండీలను దొంగలు అపహరించుకు వెళ్లారు. దీంతోపాటు జగ్గయ్యపేటలోని గాయత్రీ ఆలయంలో హుండీని అపహరించారు. దేవాలయాల్లో చోరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.