తెలియదు.. మౌనంగా ఉండండి, ఈ టైంలో ఐదారుగురు ఎమ్మెల్యేలు లేరు: వైసిపిపై బాబు
హైదరాబాద్: మేం మంచి పని చేస్తున్నామని, అభినందించకపోయినా కనీసం మౌనంగా ఉంటే మీ పరువు నిలుస్తుందని వైసిపికి ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. శాసన సభలో పట్టిసీమ పైన ప్రాజెక్టు ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడాక సభ గురువారానికి వాయిదా పడింది.
ఆనాడు చిత్తశుద్ధితో జలయజ్ఞం పూర్తి చేస్తే నీరు వచ్చి ఉండేదని చంద్రబాబు అన్నారు. చేసిన పనులు కూడా నాసిరకంగా చేశారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నుంచి వెయ్యి టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయన్నారు.
ఈ రోజు ఇక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న వారు గత తొమ్మిదేళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు విషయం తెలుసుకోకుంటే తెలుసుకోవాలన్నారు. రాయలసీమలో ప్రమాదకర పరిస్థితి ఉందన్నారు. నేను ఈ 15 నెలల కాలంలో ఎక్కువగా ఇరిగేషన్ మీద పని చేశానని చెప్పారు.
ప్రభుత్వం ఒక మంచి పని చేసినప్పుడు అభినందించాల్సింది పోయి అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది బాధేస్తోందన్నారు. అభినందించకుంటే గమ్మున ఉండాలన్నారు. ఇప్పటికీ పట్టిసీమ పైన మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారన్నారు. ఏదో తేల్చుకోలేకపోతున్నారన్నారు.
పట్టిసీమను ఛాలెంజ్గా తీసుకున్నామన్నారు. మీకు చెడు ఆలోచనలు వద్దని, రాజకీయం వద్దన్నారు. ఈ ఏడాది నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి దానిని అడ్డుకోవడమే వైసిపి పనిగా పెట్టుకుందన్నారు.
గోదావరి జిల్లాల అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. గోదావరి జిల్లాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చే బాధ్యత నాదే అన్నారు. ఇరిగేషన్ పైన మా ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందన్నారు. మీరు అడ్డుకున్నా మేం సంక్షేమం విషయంలో ముందుకు పోతామన్నారు.
గోదావరి రెండు జిల్లాలను తాను ఎప్పటికీ మర్చిపోనని, వారికి అన్యాయం చేయనని చెప్పారు. ఆ రెండు జిల్లాల ప్రజలు తనను అర్థం చేసుకున్నారన్నారు. వైసిపి రాజకీయం చేసినా వారు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలకు పూర్తిగా నీరు ఇచ్చాకే, పట్టిసీమ నుంచి మిగతా జిల్లాలకు కూడా నీరు అందిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని, ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పై నుంచి ఇంత వరకు చుక్క నీరు రాలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. అందుకే వారి చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోందన్నారు. పట్టిసీమ పైన వైసిపి ఎమ్మెల్యేలది జిల్లాకు ఓ విధానం అన్నారు. రాయలసీమకు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
పండ్ల తోటలను కూడా కాపాడాలని స్పష్టంగా చెప్పామన్నారు. మేం పట్టుదలతో పనులు చేస్తున్నామన్నారు. పట్టిసీమను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. ఓ వైపు ప్రాజెక్టులు అడుగుతూనే, మరోవైపు భూసేకరణను ఎలా వ్యతిరేకిస్తారని వైసిపిని ప్రశ్నించారు. భూములు ఆకాశంలో దొరుకుతాయా అన్నారు.
అధికారులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క ఎకరం భూమిని ఎండిపోనివ్వమని చెప్పారు. సముద్రంలో కలిసే నీటినే తెచ్చుకుంటున్నామన్నారు. వాజపేయి హయాంలోనే నదుల అనుసంధానం జరిగిందన్నారు.
నాగావళి, వంశధార పూర్తి చేయాలని, ఉత్తరాంధ్రకు నీరు ఇవ్వాలన్నారు. పోలవరంకు రూ.12వందల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మీరు ఎన్ని విమర్శలు చేసినా మేం మంచి పనిని చేయకుండా వదలమన్నారు. గత పాలకుల తప్పుడు విధానాలు వెంటాడుతున్నాయన్నారు. 2018 వరకు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు.
రాష్ట్రాన్ని కరువురహితంగా చేసే వరకు నిద్రపోనని చెప్పారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కూడా సాయానికి సిద్ధంగా ఉందని చెప్పారు. పని చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. గుత్తేదారులు పని చేయకుంటే ఊరుకోమన్నారు.
గత పాలకులు దోచుకు తిన్నారని, పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు వైసిపిని ఉద్దేశించి అన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు రాయలసీమకు నీరు ఇవ్వవద్దని మీరు చెబుతున్నారా అని వైసిపిని ప్రశ్నించారు.
మేం నీళ్లు తెస్తున్నామని, ఎంతో మంది నాయకులు ఎన్నోసార్లు చెప్పారని, కానీ ఎవరూ చేయలేదన్నారు. ఏపీలో పూర్తిగా కరవు నిర్మూలిస్తామన్నారు. ప్రతి ప్రాంతానికి నీరు ఇస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతలకు రూ.120 కోట్లు, స్వర్ణముఖికి రూ.222 కోట్లు ఖర్చు చేశామన్నారు.
దయచేసి మేం చేసే మంచి పనులకు వైసిపి అడ్డుపడవద్దని, కనీసం మౌనంగా ఉంటే మీకు పరువు నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. వెలిగొండ పూర్తి చేస్తే ప్రకాశం కరువు రహితంగా ఉంటుందన్నారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా మేం అనుకున్న లక్ష్యం చేరుకుంటామన్నారు.
ప్రభుత్వంపై ఊరికే విమర్శలు సరికాదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయ ఉద్దేశ్యమే అన్నారు. మీకు ప్రాజెక్టుల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో... ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతుంటే సభలో మీరు ఉన్న ఎమ్మెల్యేలను చూస్తుంటేనే అర్థమవుతోందన్నారు.
రాయలసీమకు నీరు అందించే ఇంత మంచి టాపిక్ గురించి మాట్లాడుతుంటే.. కనీసం ఐదారుగురు వైసిపి ఎమ్మెల్యేలు కూడా సభలో లేరని, కనీసం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా లేరని, నేను విమర్శించడం లేదని, ముఖ్యమైన టాపిక్ మాట్లాడుతుంటే ఎందుకు లేరని ప్రశ్నించారు.