పీఎం కిసాన్ , అన్నదాత సుఖీభవ నిధులు ఒకే సారి- ముమూర్తం ఖరారు, వీరికే..!!
రైతులకు ఒకే సారి రెండు పథకాల నిధులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ అర్హత ఉన్న రైతుకు అందిస్తున్న పీఎం కిసాన్ మలి విడత నిధుల జమకు ముహూర్తం ఖరారు చేసింది. పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం అర్హుల జాబితా సిద్దం చేసింది. రైతు భరోసా కేంద్రాలు.. వెబ్ సైట్ లో ఉన్న జాబితాకు అనుగుణంగా రైతులు అర్హత చెక్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు పథకాల నిధులు కలిపి రూ 7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
రెండు పథకాలు ఒకేసారి
పీఎం కిసాన్ 20 వ విడత నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. జూన్ మాసంలోనే ఈ నిధులను విడుదల చేస్తారని తొలుత భావించారు. పీఎం కిసాన్ తో పాటుగానే ఏడాదిలో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా కేంద్రం మూడు విడతలుగా రూ 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తోంది. వాటితో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు రూ 14 వేలు మూడు విడుతలుగా అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాలను వెల్లడించింది.

18న విడుదల కు ఛాన్స్
ఈ నె 18న పీఎం కిసాన్ నిధులు విడదలకు కేంద్రం ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే రోజున ఏపీ ప్రభుత్వం సైతం తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ఈ నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. ఈ రెండు పథకాలు ఒకే రోజు అమలు చేయటం ద్వారా కేంద్రం నుంచి వచ్చే రూ 2 వేలు.. ఏపీ ప్రభుత్వం జమ చేసే రూ 5 వేలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
వీరికే అవకాశం
ఏపీలో ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద కింద 47.77 లక్షల రైతులను లబ్దిదారులుగా అధికారులు గుర్తించారు. వీరిలో దాదాపు అందరికీ ఈ కేవైసీ పూర్తి చేసారు. ఎవరైనా లబ్దిదారు అర్హత లేకపోతే.. వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం కింద వెబ్ ల్యాండ్ లో నమోదయిన రైతుల భూమి వివరాలు కచ్చితంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు. దీంతో, రైతులు ప్రభుత్వ వెబ్ సైట్లతో పాటుగా రైతు భరోసా కేంద్రాల్లో జాబితాల ను పరిశీలించటం ద్వారా.. ఎవరైనా అర్హత ఉండీ జాబితాలో పేరు లేకపోతే వారికి మరో అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు ఈ నెల పదో తేదీ తుది గడువుగా చెబుతున్నారు. ఇక, ఈ ప్రక్రియ పూర్తి చేస్తే.. ఈ నెల 18న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications