ప్రధాని - చిరంజీవి మంతనాలు : పీఎం-సీఎంతో రోజా సెల్పీ సందడి : సోదరుడంటూ జగన్..!!
ప్రధాని మోదీ హాజరైన భీమవరం సభలో అసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సభకు ప్రధానితో పాటుగాగవర్నర్.. సీఎం జగన్.. కిషన్ రెడ్డి...రోజా..చిరంజీవి హాజరయ్యారు. ప్రధానితో పాటు వేదికను షేర్ చేసుకున్నారు. ముందుగా మాట్లాడిన కిషన్ రెడ్డి తన ప్రసంగంలో సీఎం జగన్.. చిరంజీవి పేర్లు ప్రస్తావించిన సమయంలో సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. మాజీ కేంద్ర పర్యాటక మంత్రి గా.. ప్రముఖ సినీ హీరోగా ప్రత్యేకించి చిరంజీవిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి..అక్కడ నుంచి భీమవరం సభకు చేరుకున్నారు.
పీఎం - సీఎం చర్చలు
గన్నవరం కు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికిన సీఎం జగన్..విమానాశ్రయంలో ప్రత్యేకంగా చర్చలు చేసారు. ఇద్దరూ కలిసి భీమవరం వెళ్లారు. సభలో సీఎం జగన్ తన ప్రసంగంలో అల్లూరికి నివాళి అర్పించారు. చిరంజీవిని ప్రస్తావిస్తూ తన సోదరుడిగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనూ సభకు హాజరైన వారి నుంచి స్పందన వ్యక్తం అయింది. ఇక, ప్రధాని తన ప్రసంగం ముగిసిన తరువాత.. చిరంజీవి ఆయన వద్దకు వచ్చారు. శాలువాతో సత్కరించారు. ఆ సమయంలో చిరంజీవి భుజం తట్టిన ప్రధాని.. కొద్ది సేపు ముచ్చటించారు. చిరంజీవి సైతం వినయంగా ఆయనకు సమాధానం ఇచ్చారు.
ప్రధాని - మెగాస్టార్ మంతనాలు
అటు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ హాజరు కాకపోవటం.. ఇదే సమయంలో చిరంజీవి హాజరుతో పాటుగా పీఎం - సీఎం ఇద్దరి నుంచి అందుకున్న గౌరవం రాజకీయంగానూ చర్చకు కారణమైంది. ఇక, కార్యక్రమం ముగిసే వేళ మంత్రి రోజా వేదిక పైనే సెల్ఫీ సందడి చేసారు. ప్రధానితో సెల్ఫీ అడిగిన రోజా..ఆ సెల్ఫీలోకి సీఎం జగన్ ను రావాలని కోరారు. ఆ సమయంలో రోజాను ప్రధానికి సీఎం జగన్ పరిచయం చేసారు. అంతటితో రోజా ఆగలేదు.
రోజా సెల్ఫీ హంగామా
ప్రధానిని ఒన్ మోర్ ప్లీజ్ అంటూ.. ప్రధానితో మరో సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఆపేమయమన్నట్లుగా సీఎం జగన్ సూచనలు చేసారు. ప్రధాని వేదిక దిగే సమయంలో..చిరంజీవితోనూ కలిసి ఫ్లెక్సీ కోసం రోజా ప్రయత్నించారు. కానీ, చిరంజీవి సీఎంతో మాట్లాడుతూ ఉండిపోయారు. ఇక, ప్రధాని బయల్దేరటంతో నేతలంతా ఒక్క సారిగా ఆయనను ఆనుసరించారు. రోజాకు వేదిక పైన మాట్లాడే అవకాశం దక్కకపోయినా .. మంత్రి హోదాలో పాల్గొనటం పైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.