బాబు ఎఫెక్ట్, గవర్నర్తో మోడీ భేటీ రద్దు?: 'ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని చంద్రబాబును అడిగా'
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లను కలిసి గురువారం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కాని బుధవారం ఉదయమే ఆయన హైదరాబాద్ వచ్చారు.
Recommended Video

ఇటీవల గవర్నర్ నరసింహన్ విజయవాడలో సీఎం చంద్రబాబును కలవడం, ఆ తర్వాత మంత్రులు గవర్నర్ పైన విరుచుకుపడుతుండటం తెలిసిందే. అంతేకాదు సీఎం చంద్రబాబు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా గవర్నర్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలోనే మోడీ - నరసింహన్ భేటీ రద్దయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కలవాల్సిన వారిని కలిశాను
నేను కలవాల్సిన వారిని కలిశానని, వచ్చిన పని అయిపోయిందని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. గురువారం వరకు ఆయన ఉంటారని భావించి కొందరు స్నేహితులు మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. కానీ వచ్చిన పని పూర్తి కావడం లేదా ఉదయం వెళ్లి పోవడం వల్లనో లంచ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు వారికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

ప్రధానిని కలవకపోవడం వెనుక
గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన హడావుడిలో ఉన్నందున పీఎంవో అపాయింటుమెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అంతేతప్ప మరో కారణం లేదని మరో వాదనగా ఉంది.

మీడియా కథనాలపై గవర్నర్ ఆవేదన
బుధవారం ఉదయం తెలంగాణ భవన్లో బస చేసిన గవర్నర్ నరసింహన్ను మీడియా పత్రినిధులు కలిసినప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడారు. మీడియాలో తనపై వస్తున్న కథనాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి తనకు తెలియని విషయాలు ఎక్కువగా మీడియాలో వస్తుంటాయని, తాను ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ కేంద్రానికి నివేదికలు ఇచ్చినట్లు రాస్తున్నారని చెప్పారు. తాను ఈ పర్యటన కుదించుకొని ఏమీ వెళ్లట్లేదు. అనుకున్నట్లుగానే జరిగిందని, వచ్చిన పని అయిపోవడంతో వెళ్లిపోతున్నానని చెప్పారు.

నేను చెప్పలేదు, మీడియా రాసింది
మోడీ, రాజ్నాథ్ సింగ్లను కలిశారా అని అడిగితే... వారిని కలుస్తానని నేను చెప్పలేదని, మీడియానే రాసిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఇటీవల చంద్రబాబుతో జరిగిన సమావేశం సాధారణమైందేనని, అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా కలిశానని చెప్పారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో రాజకీయాలేమీ లేవన్నారు.

చంద్రబాబును అడిగాకే, రాష్ట్రపతి పాలనకు సిఫార్స్
విశాఖపట్నం వెళ్లడం వల్ల మధ్యలో విజయవాడలో ఆగి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఏపీ, తెలంగాణలలో పరిస్థితులు సాధారణంగా ఉండేలా చూడటమే తన బాధ్యత అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాష్ట్రపతి పాలన పెట్టడానికే తనను తెచ్చినట్లు ప్రచారం చేశారని, ఉమ్మడి రాష్ట్రం చివరి రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏమైనా ఏర్పాటు చేస్తారా అని చంద్రబాబు నాయుడిని అడిగానని, ఆయన నో చెప్పడంతో గత్యంతరం లేకే మూడు నెలలు రాష్ట్రపతి పాలనకు సిఫార్స్ చేశానని చెప్పారు.












Click it and Unblock the Notifications