కాంగ్రెస్ వలనే పెద్దల సభకు రాగలిగా : రాజ్యసభలో సాయిరెడ్డికి వీడ్కోలు : తిరిగి రావాలి - ప్రధాని..!!
రాజ్యసభలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. 72 మంది ఎంపీలు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. సభలో ఎంతో కాలం గడిపామని, సభకు ఇచ్చినదానికంటే, సభే అందరి జీవితాలకు ఎంతో తోడ్పాటు అందించిందని మోదీ చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా పొందిన అనుభవాన్ని దేశ నలుమూలలకు తీసుకెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించారు. భావి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. వీరంతా మరోసారి సభకు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక, వైసీపీ పార్లమెంటరీ పార్టీ విజయసాయిరెడ్డి తో మరో ముగ్గురు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో..రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ బనాయించిన కేసుల కారణంగానే
కాంగ్రెస్ పార్టీ నాడు తమ మీద అక్రమ కేసులు బనాయించటం వలనే తాను రాజ్యసభకు రాగలిగానని సాయిరెడ్డి సైటైరికల్ గా చెప్పారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు సీఎం జగన్ కు సాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పైన సాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న ఛైర్మన్ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు శ్రీ జైరాం రమేష్కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
ఛైర్మన్ వెంకయ్య.. నిర్మల పై ప్రశంసలు
అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్ సభ్యులు ఐకే గుజ్రాల్ ను గుర్తు చేసుకున్నారు. ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పని తీరును సాయిరెడ్డి ప్రశంసించారు. ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసే వారని అభినందించారు. టూరిజం, ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్ కమిటీని అధిగమించడానికి కామర్స్ కమిటీ చైర్మన్గా తాను తాపత్రయపడుతుండే వాడినని అన్నారు.
సాయిరెడ్డికి రెన్యువల్ ఖాయమంటూ
అయితే, జూన్ వరకు పదవీ కాలం ఉన్నా.. ఈ ప్రస్తుత సమావేశాలు ముగిసిన తరువాత తిరిగి వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే, ఏపీ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం సభ్యుడిగా ఉంటూ..ఈ రోజు పదవీ విరమణ చేసిన విజయ సాయిరెడ్డికి మరోసారి రెన్యువల్ అవుతుందని వైసీపీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం - కేంద్రం మధ్య ఆయన ఒక విధంగా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కొత్త సభ్యుల ఎంపికకు సంబంధించి కేబినెట్ ప్రక్షాళన తరువాత సీఎం జగన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.