కెసిఆర్కు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా?
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భేటీకి సమయం ఇవ్వడం లేదనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్ర విభజన సమస్యలను వినిపించడానికి అఖిల పక్ష ప్రతినిధులను మోడీ వద్దకు తీసుకుని వెళ్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు. అయితే, మోడీ కెసిఆర్కు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో నోరు మెదపడం లేదని అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) మోడీ అపాయింట్మెంట్ను కోరింది. అయితే, ప్రధాని కార్యాలయం నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో ఈ నెల 7వ తేదీన జరిగే ముఖ్యమంత్రుల సమావేశాన్ని కెసిఆర్ వాడుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. రద్దు చేసిన ప్రణాళిక సంఘం స్థానంలో మరో సంస్థను ఏర్పాటు చేసే విషయంపై చర్చించడానికి ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైంది.

ఆ సమావేశానికి ముందుగానీ, తర్వాత గానీ తన కోసం కొన్ని నిమిషాలు కేటాయిస్తారనే ఆశతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో తెలంగాణకు సంబంధించిన విషయాలను మోడీ చెవిన వేయాలని ఆయన భావిస్తున్నారు.
మోడీ వద్దకు అఖిల పక్ష ప్రతినిధులను తీసుకుని వెళ్లడానికి సిఎంవో జూన్ నెల నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చడంపై, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు కోటాపై చర్చించడానికి సిఎంవో ఇంతకు ముందు ప్రధాని అపాయింట్మెంట్ కోరింది.
సిఎంవో కార్యాలయం నిరంతరం పిఎంవో కార్యాలయాన్ని సంప్రదిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదని అంటున్నారు. మోడీ అపాయింట్మెంట్ సాధించే బాధ్యతలను కెసిఆర్ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధి వేణుగోపాలాచారిలకు అప్పగించారు.












Click it and Unblock the Notifications