ఏపీలో 3 కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన: వాటివల్ల ఇవీ ప్రయోజనాలు
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గుంటూరు నుంచి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. రిమోట్ ద్వారా నవ్యాంధ్రలోని వివిధ ప్రాజెక్టులకు మోడీ స్విచ్చాన్ చేశారు. విశాఖపట్నంలోని వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.1178 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్ర ఇంధన, సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్మించనుంది. డాల్ఫినోస్ కొండలో భూగర్భ కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు.
కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో బీపీసీఎల్ చమురు నిల్వ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. అలాగే, అమలాపురం వద్ద ఓఎన్జీసీ వశిష్ఠ ఎస్1 ఆన్షోర్ ప్రాజెక్టును ప్రారంభించారు. తొమ్మిదేళ్లలో 9.58 బిలియన్ క్యూబిక్ మీటర్ల చమురును వెలికితీస్తారు. ఈ మూడు అభివృద్ధి కార్యక్రమాలకు గుంటూరు నుంచి స్విచ్చాన్ చేశారు. మొత్తంగా చమురు, సహజవాయువులకు సంబంధించి మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
అనంతరం గుంటూరు జిల్లా ఎటుకూరులో బహిరంగ సభలో పాల్గొన్నారు. వేదిక పైన పరిమిత సంఖ్యలో నేతలు కూర్చున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి కూర్చున్నారు.
ఏమిటీ మూడు ప్రాజెక్టులు?
విశాఖలో వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీని నిల్వ సామర్థ్యం 1.33 మిలియన్ మెట్రిక్ టన్నులు అంచనా వ్యయం రూ.1,178.35 కోట్లు. తీర ప్రాంతాల్లో మూడుచోట్ల ముడిచమురు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్పీఆర్ఎల్, ఓఐడీబీ, కేంద్ర ఇంధన, సహజ వాయువులు, ఇంజినీరింగ్ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఈ చమురు నిల్వ కేంద్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రిఫైనరీలకు పైపులైన్లు, నౌకల్లో సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
రెండో ప్రాజెక్టు.. పెట్రో కోస్టల్ టెర్మినల్. దీని విస్తీర్ణం 100 ఎకరాలు. కృష్ణపట్నం ఏర్పాటు. రూ.700 కోట్లు అంచనా వ్యయం. ఇది దేశంలోని మూడో అతిపెద్ద చమురు కంపెనీల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ కృష్ణపట్నంలో చమురు సమీకరణ, నిల్వ, పంపిణీల కోసం ప్రత్యేక టెర్మినల్ను ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకించి మోటార్ స్పిరిట్, ఇథనాల్, హైస్పీడ్ డీజిల్, బయో డీజిల్ను ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు.
మూడో ప్రాజెక్టు... గ్యాస్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు. దీని వ్యయం అంచనా రూ. రూ.5,300 కోట్లు. కేజీ బేసిన్లోని ఓఎన్జీసీ నిర్వహిస్తున్న వశిష్ట ఎస్1 బావి నుంచి చమురుని వెలికితీసే ఆఫ్షోర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సిద్ధమైంది. అమలాపురం సమీపంలోని తీరప్రాంతంలో ఏర్పాటైన బావుల నుంచి చమురు వెలికి తీస్తారు. తొమ్మిదేళ్లలో 9.58 బిలియన్ క్యూబిక్ మీటర్ల చమురును ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.
Andhra Pradesh: Prime Minister Narendra Modi lays the foundation stone for Krishnapatnam Bharat Petroleum Corp. Ltd (BPCL) coastal terminal project in Guntur. pic.twitter.com/eiR9bHlKXX
— ANI (@ANI) February 10, 2019