జగన్, చంద్రబాబుకు మోడీ కొత్త పోటీ ? బీజేపీకి మళ్లీ ఊపిరిలూదేలా ! ఏం జరుగుతోంది ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు వరకూ టీడీపీకి అండగా ఉన్న బీజేపీ, ప్రధాని మోడీ.. అప్పట్లో చంద్రబాబు తిరుగుబాటుతో వైసీపీకి అండగా నిలవడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ తో పాటు బీజేపీ కూడా రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. వైసీపీతోనూ దీర్ఘకాలం ఏకపక్షంగా ముందుకెళ్లడం మంచిది కాదని భావిస్తున్న వీరు.. ఈ మధ్యనే చంద్రబాబును సైతం దగ్గరకు తీసుకుంటున్నారు. అదే సమయంలో జగన్, చంద్రబాబుతో భేటీల సందర్భంగా ప్రధాని మోడీ ఓ కీలక టార్గెట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్-మోడీ-చంద్రబాబు
తాజాగా ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోడీ విడివిడిగా సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై వీరితో చర్చించారు. అలాగే దేశవ్యాప్తంగా తాము చేపడుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి కూడా వీరికి ప్రధాని మోడీ వివరించారు. అదే సమయంలో ఇరు పార్టీలు తాజాగా బీజేపీకి దగ్గరవుతున్న తీరుకు కూడా ఈ భేటీలు నిదర్శనంగా నిలిచాయి. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

జగన్, చంద్రబాబుకు మోడీ టార్గెట్
తాజాగా జగన్, చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోడీ వీరిద్దరికీ ఓ కొత్త టార్గెట్ పెట్టిన్నట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్ ను తప్పనిసరిగా చేరుకునేందుకు ప్రయత్నించాలని వీరిద్దరినీ కోరినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఈ టార్గెట్ ను చేరుకునేందుకు ఇప్పుడు ఇరు పార్టీల అధినేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం అప్పుడే రాష్ట్ర రాజకీయాలపైనా కనిపిస్తోంది. మోడీని ఇరువురు నేతలు కలిసిన తర్వాత చోటు చేసుకుంటున్న మార్పులు ఆయా పార్టీల్లో సైతం చర్చనీయాంశమవుతున్నాయి.

హర్ ఘర్ తిరంగా టార్గెట్
ప్రధాని మోడీని జగన్, చంద్రబాబు కలిసిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా చేపడుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీరిద్దరినీ మోడీ కోరినట్లు సమాచారం. దీంతో మోడీకి సరేనన్న జగన్, చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి రాగానే దీన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ నేతలకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇళ్లపై జెండాలు ఎగరేయడం, సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలు మార్చేయడం సహా మోడీ చెప్పిన అన్ని కార్యక్రమాలు విధిగా చేపట్టాలని సూచించారు. దీంతో ఇప్పుడు ఆయా నేతలు బీజేపీ నేతలతో పోటీ పడి మరీ ఇవన్నీ చేసేస్తున్నారు.

బీజేపీ బలోపేతం చేసే వ్యూహం ?
కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపై ఇప్పటికే విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ జెండా డీపీలు పెట్టుకోవాలన్న మోడీ సూచనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీలో తనకు అండగా ఉన్న వైసీపీ, టీడీపీలతో ముందుగా ఆ పని చేయించాలని మోడీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీతో పాటు వైసీపీ, టీడీపీ కూడా ప్రయత్నిస్తున్నాయి. పైకి చూసేందుకు దేశభక్తి భావన రగిలించే కార్యక్రమంలా కనిపిస్తున్నా అంతర్గతంగా బీజేపీ కోరుకునే దేశభక్తి అజెండాను జనంలోకి బలంగా పంపే ఆలోచన ఇందులో దాగుందని ఇతర పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు.












Click it and Unblock the Notifications