చంద్రబాబు బరువు తగ్గిందన్న మోడీ ? బలుపు తగ్గింది..ప్రచారం తగ్గలేదంటున్న సాయిరెడ్డి !
ఏపీ రాజకీయాలు రెండు రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. జీ20 సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో అఖిలపక్షంతో ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు పాల్గొనడం దగ్గరి నుంచి అక్కడ మోడీ వీరిద్దరితో మాట్లాడిన మాటల వరకూ ప్రతీదీ చర్చనీయాంశమవుతోంది. ఇదే క్రమంలో చంద్రబాబుతో మోడీ మాట్లాడిన ఓ అంశంపై కొన్ని మీడియా సంస్ధల్లో జరుగుతున్న ఓ ప్రచారంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.
చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ ఆయన్ను మీరు బరువు తగ్గినట్లున్నారుగా అని చెప్పినట్లు ఓ వర్గం మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై సెటైర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో నిత్యం చంద్రబాబుపై సెటైర్లతో ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి కూడా ఇదే వరుసలో చేరిపోయారు. చంద్రబాబుతో మోడీ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలకు మరింత మసాలా జోడించి ఇవాళ సాయిరెడ్డి ట్వీట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
సాయిరెడ్డి తన ట్వీట్ లో చంద్రబాబు బరువు తగ్గారంటూ ప్రధాని మోడీ చెప్పినట్లు ఓ మీడియా ఛానల్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ పిక్ పెట్టారు. దీన్ని ప్రస్తావిస్తూ పీఎంగారు నీ బరువు తగ్గిందన్నారా ? బలుపు తగ్గిందన్నారా చంద్రం అన్నయ్యా ? ఏది తగ్గినా నీ ప్రచార యావ మాత్రం తగ్గలేదు.. ఏం ఎలివేషన్స్ బాబన్నయ్యా ! పులిహోరా, దద్దోజనం బాగా కలపండి అంటూ సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. తద్వారా మోడీ అన్నా అనకపోయినా చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఎలివేషన్స్ ఇచ్చి ప్రచారం చేసుకుంటోందనే అర్ధం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు.