చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ప్రధాని హామీ - జగన్ కు ఆహ్వానం..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరుంది. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం, వేదిక ఖరారయ్యాయి. ఎన్డీఏలోనూ టీడీపీ కీలకంగా మారటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా భాగస్వామ్య పక్షాల పార్టీల అధినేతలు..ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఏపీలోనూ అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానం పలుకుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గన్నవరం వద్ద కీసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో కాకుండా బహిరంగ సభలో, ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. ప్రజలు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో కేసరపల్లి వద్ద ఉన్న మైదానం జాతీయ రహదారి పక్కన ఉంది. విమానాశ్రయం నుంచి అతి దగ్గరగా ఉండడంతో విఐపీల రాకపోకలకు అనువుగా ఉంటుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది.

ప్రధాని సహా ప్రముఖల రాక
ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు..పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఏపీలోని అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించాలని టీడీపీ నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, జగన్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా అనేది చూడాల్సి ఉంది. తనకు ఆహ్వానం అందితే హాజరవుతానని తెలంగాణ సీఎం రేవంత్ కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చారు. అయితే, ఎన్డీఏ పక్షాలు వస్తుండటతో రేవంత్ తుది నిర్ణయం ఏంటనేది వేచి చూడాలి.
ప్రధాని హామీ పై ఆసక్తి
ఇక ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ సమయంలో చంద్రబాబు కేంద్రం నుంచి మద్దతు పైన భారీ అంచనాలతో ఉన్నారు. దీంతో..చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం వస్తున్న ప్రధాని మోదీ ఆ సమయంలోనే ఏపీకి తమ సహకారం పైన కీలక ప్రకటన చేస్తారనే అంచనాలు ఉన్నాయి. పోలవరం పునరావాసం పై సవరించిన అంచనాలకు ఆమోదం.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ నిర్ణయం ఉప సంహరణ వంటి వాటి పైన ప్రకటన ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, రాజధాని తో పాటుగా సంక్షేమ హామీల అమలు చంద్రబాబుకు సవాల్ గా మారుతున్నాయి. దీంత, మోదీ ఏం ప్రకటన చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications