ఈ నెల 11, 12 తేదీల్లో మోడీ విశాఖ టూర్-7 ప్రాజెక్టుల శంఖుస్ధాపన-రాజకీయం చేయొద్దన్న సాయిరెడ్డి
ఏపీలో ప్రధాని మోడీ విశాఖ టూర్ ఖరారైంది. ఈ నెల 11న విశాఖ టూర్ కు రానున్న ప్రధాని మోడీ 12న నగరంలో పర్యటిస్తారు. సీఎం జగన్ తో పాటు పలువురు స్ధానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ టూర్ లో పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులకు మోక్షం కలగబోతోంది. వీటి వివరాలను ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రధాని టూర్ నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు.

విశాఖలో 11,12న ప్రధాని టూర్
ప్రధాని మోడీ విశాఖ పర్యటన అధికారికంగా ఖరారైంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ విశాఖలో ఈనెల 11, 12 తేదీల్లో పర్యటించబోతున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 11న సాయంత్రం విశాఖకు చేరుకోనున్న ప్రధాని మోడీ.. తూర్పునౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగాలో బస చేస్తారు. ప్రధానికి సీఎం జగన్ విశాఖలో ఘనస్వాగతం పలకబోతున్నారు.

ఏయూలో బహిరంగసభ
ఈ నెల 12న ప్రధాని మోడీ ఏయూలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొంటారు. ఇందులోనే మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్ధాపన చేయబోతున్నారు. దీంతో ఈ సభకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సభకు 65 వేల నుంచి లక్ష మంది వరకూ హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి లభించడంతో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ తో పాటు పలువురు వీఐపీలు కూడా హాజరుకానున్నారు.

ఏడు ప్రాజెక్టులకు శంఖుస్ధాపన
ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో మొత్తం ఏడు కీలక ప్రాజెక్టులకు శంఖుస్దాపన చేయబోతున్నారు. వీటి విలువ రూ.10475 కోట్లని అధికారులు ప్రకటించారు. ఇందులో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, ఉత్తరాంధ్రలో పలు కేంద్ర ప్రభుత్వ రోడ్ల, గెయిల్ పైప్ లైన్ శంకుస్థాపనలు ఉంటాయని విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా పీఎంవో చివరినిమిషంలో షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీటన్నింటినీ ప్రధాని మోడీ వర్చువల్ విధానంలోనే శంఖుస్ధాపన చేయబోతున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఈ రెండు రోజుల పాటు విశాఖలో భారీ స్దాయిలో ఆంక్షలు విధించబోతున్నారు.

రాజకీయం చేయొద్దన్న విజయసాయిరెడ్డి
ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ టూర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇది రాజకీయ పర్యటన కాదన్నారు. ఇది పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదని, పూర్తిగా అధికారిక కార్యక్రమమన్నారు. దీన్ని రాజకీయం చేయొద్దని విపక్షాలను విజయసాయిరెడ్డి కోరారు. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో తేలాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ ప్రధాని విశాఖ టూర్ పై మోడీ సొంత పార్టీ బీజేపీకి కూడా పూర్తి వివరాలు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications