'మోడీ నిజాయితీ ఎక్కడ, వెంకయ్య ఏం చెప్తారు': అర్థం చేసుకోండి.. బాబు
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ పైన, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గురువారం మండిపడ్డారు. నీతివంతుడినని చెప్పుకునే ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రధాని మోడీ మాట తప్పడం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రమంత్రులు చెప్పడం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో లేవనెత్తడం సంతోషించదగ్గ విషయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేత అయిన దేవినేని నెహ్రూ... టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ పైన ప్రశంస కురిపించడం గమనార్హం. ఇంకా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా వస్తుందని నిత్యం చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
విశాఖలో జేఏసీ ధర్నా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పిన కేంద్రం ప్రకటనను నిరసిస్తూ విశాఖలో జేఏసీ ధర్నా చేపట్టింది. కేంద్రం తన ప్రకటనను వెనక్కి తీసుకోపోతే ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. విజయవాడలోను మున్సిపల్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
కేంద్రం సహకరించట్లేదు, అర్థం చేసుకోండి: చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా భావనాపాడు పోర్ట్ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. వారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తాను కేంద్రం సహకరించకున్నా శ్రమిస్తున్నానని చెప్పారు. పోర్టు, షిప్పింగ్ హార్బర్ రెండూ వస్తాయని చెప్పారు.
అవసరమైన మేరకే భూమిని తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలోనే పోర్టు నిర్వహిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలోని ప్రజల కంటె మెరుగైన ప్యాకేజీ ఇస్తామని, పరిస్థితులను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.