ఏపీకి ప్రధాని మోదీ - బీజేపీ చీఫ్ నడ్డా : మారుతున్న సమీకరణాలు..!!
ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనం.. షార్ సందర్శనకు మాత్రమే ఏపీకి వచ్చారు. అధికారికంగా - రాజకీయంగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు..జూలై 4న ప్రధాని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని చెప్పుకొచ్చారు. ఇది అధికారికంగా పాల్గొనే కార్యక్రమంగా తెలుస్తోంది. అయితే, బీజేపీ నేతలు - కార్యకర్తలతోనూ ప్రధాని సమావేశం అవుతారని పార్టీ నేతలు చెబుతున్నా..అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు.
ఏపీ రాజకీయాలపై బీజేపీ ఫోకస్
ఇక, ఇదే సమయంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం పైన చర్చ కొనసాగుతూనే ఉంది. టీడీపీ - జనసేన కలుస్తాయని ప్రచారం సాగుతున్నా..రెండు పార్టీల అధినాయకత్వం నుంచి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని చెప్పిన జనసేన అధినేత పవన్.. పరోక్షంగా అన్ని పార్టీలు కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెబుతున్నారు.
కానీ, టీడీపీ - బీజేపీ తిరిగి ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం ఉందా అనేది సందేహంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ఏపీలో వరస పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఆయన జూన్ 7, 8 తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. 7వ తేదీన రాజమహేంద్రవరంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
నడ్డా పర్యటనలో పొత్తులపై క్లారిటీ
8వ తేదీన విజయవాడలో పార్టీ సమావేశాల్లో ఆయన రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అదే విధంగా 8వ తేదీన నడ్డాతో జనసేన చీఫ్ పవన్ సైతం భేటీ అయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికీ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని... పార్టీ చీఫ్ ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో... రెండు పార్టీల అధినేత సమావేశంలో భవిష్యత్ పొత్తులు.. టీడీపీతో స్నేహం వంటి అంశాల పైన ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతిలో పార్టీ నేతలతో సమావేశం తరువాత.. ఏపీ బీజేపీ నేతల తీరులో కొంత మార్పు మొదలైంది. వైసీపీ ప్రభుత్వం పైన రాజకీయంగా విమర్శలను పెంచింది. అమరావతికి మద్దతు ప్రకటించింది.
బీజేపీ - జనసేన బంధం కొనసాగేనా
కేంద్రంతో వైసీపీ అధినాయకత్వం సఖ్యతగా ఉన్న సమయంలో.. బీజేపీ - వైసీపీ సంబంధాల పైన క్లారిటీ ఇవ్వాలని ఏపీ బీజేపీ నేతలు కోరుతున్నారు. రాజకీయంగా ఎవరి దారి వారిదేనని కొంత మంది నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, నడ్డా వచ్చే నెల పర్యటన తరువాత కేంద్ర మంత్రులు .. పార్టీ ప్రముఖులు సైతం ఇక నుంచి తరచూ ఏపీ -తెలంగాణల్లో పర్యటించేలా కార్యాచరణ సిద్దం అవుతోంది.
దీంతో..ఇప్పటికే ఏపీలో ఒక రకంగా ఎన్నికల మూడ్ మొదలైంది. ఇక.. బీజేపీ కేంద్ర నేతలు సైతం ఏపీ కార్యక్రమాల పైన ఫోకస్ పెడుతుండటంతో భవిష్యత్ పొత్తులు - ఏపీ సమీకరణాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.