శాస్త్ర, సాంకేతిక రంగాలకు అమిత ప్రోత్సాహం: సైన్స్ కాంగ్రెస్లో మోడీ
తిరుపతి: ఇండియన్స్ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రభుత్వం అమితమైన ప్రోత్సహామిస్తోందని తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు.
పర్యావరణం, నీటి శుద్ధి రంగాలు కీలకంగా మారాయని అన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా ఉత్పత్తిరంగ అభివృద్ధికి కృషి జరుగుతోందని అన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. సైంటిఫిక్ పబ్లికేషన్స్ లో మనదేశం 6వస్థానంలో ఉందని అన్నారు.
మరిన్ని ఆవిష్కరణలకు మన శాస్త్రవేత్తలు నాంది పలకాలని అన్నారు. సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శాస్త్రవేత్తలకు మోడీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. 12కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవసాయ, విద్య, సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.
వర్సిటీలు, ఐఐటీలు, మంత్రిత్వశాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమాజ సాధికారతకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు దేశం కతృజ్ఞతగా ఉంటుందని తెలిపారు. సైబర్, రోబోటిక్స్ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని విస్తరింప చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సేవా, ఉత్పత్తి రంగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో పనిచేస్తున్న మేటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు మౌళిక అధ్యయన వ్యవస్థను విశ్వస్థాయిలో రూపుదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మౌళిక విజ్ఞానాన్ని ఆవిష్కరణలు, స్టార్ట్ అప్ దిశగా తీసుకెళ్లాలన్నారు. దాని వల్లే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి సాంకేతికత అందుబాటులోకి రావాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలను సత్కరించారు.
శాస్త్రసాంకేతిక రంగాలకు ప్రాధాన్యం
104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభించడం సంతోషంగా ఉందని మోడీ అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని అన్నారు.
సవాళ్ల ఎదుర్కొంటూ..
సవాళ్లను ఎదుర్కొంటూ దీర్ఘకాల ప్రయోజనాల కోసం వారు కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. దేశం గర్వించదగ్గ మరిన్ని కొత్త ఆవిష్కరణలకు మన శాస్త్రవేత్తలు నాంది పలకాలని అన్నారు. వర్శిటీలు, ఐఐటీలు, స్టార్టప్లు, మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమాజ సాధికారితకు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు దేశం కృతజ్ఞతగా ఉంటుందన్నారు.
మనమే ముందు..
2030 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో భారత్ ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. విభిన్న అంశాల్లో సాధిస్తున్న శాస్త్ర, పరిశోధనలకు మా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని తెలిపారు. దేశ శాస్త్ర సాంకేతిక విధానాలు కనిపించేలా నీతిఆయోగ్ రూపకల్పన చేస్తోందన్నారు. సైబర్, రోబోటిక్స్ రంగాల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు.
డిజిటల్ ఇండియా
‘వాతావరణ మార్పులు, హాని చేసే సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలి. డిజిటల్ ఇండియా ద్వారా ఉత్పత్తి రంగ అభివృద్ధికి కృషి జరుగుతోంది. వ్యవసాయం, విద్య, సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
చంద్రబాబు మాట
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో సైన్స్ సదస్సు నిర్వహించుకోవడం అదృష్టమన్నారు.
అతిపెద్ద నిర్ణయాలు
‘ఆర్థిక సంస్కరణల్లో రెండు అతిపెద్ద నిర్ణయాలను(పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ) ప్రధాని మోదీ తీసుకున్నారు. అవినీతి, నల్లధనం నివారణకు ప్రధాని తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. భారత్ మానవ వనరుల కేంద్రంగా మారింది.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో బయోమెట్రిక్ పద్ధతిలో చౌకదుకాణాల నుంచి సరుకులు అందిస్తున్నాం. సెల్ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాం. నెలకు రూ.149తో ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తున్నాం' అని చంద్రబాబు తెలిపారు.
మోడీకి ఘనస్వాగతం
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు.