బాబు-మోడీ జోడీ ఏపీ కల నెరవేరుస్తుంది: ప్రధాని ఉద్వేగం, హోదా లేదు.. మట్టి!
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన పూర్తయింది. అనంతరం ప్రముఖులు మాట్లాడారు. చివరలో ప్రధాని మాట్లాడారు. విభజన హామీలను ఆయన ప్రస్తావించారు.
విభజన చట్టంలో పేర్కొన్న హామీల కంటే ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నామని ప్రధాని చెప్పారు. అందులో భాగంగానే ఐఐటీ, త్రిపుల్ ఐటీ, ఎయిమ్స్, పెట్రో యూనివర్శిటీలను ఏపీలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మానవ వనరుల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Photos: అమరావతి శంకుస్థాపన

విదేశాల్లో స్థిరపడిన ఎందరో తెలుగువారు దేశానికి రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా సహకరిస్తుందన్నారు. దానికి నిదర్శనంగానే తాను మట్టి, నీరు తీసుకొచ్చి చంద్రబాబుకు ఇచ్చినట్లు చెప్పారు.
విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అక్షరం తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. పార్లమెంటు నుంచి మట్టిని, యమునా నుంచి మట్టి, నీరు తేవడానికి గల కారణాన్ని ఆయన చెప్పారు. తాను అమరావతిలో కలిపేందుకు సాక్షాత్తూ దేశ రాజధానినే తీసుకు వచ్చానన్నారు. ఈ సందర్భంగా ప్రజలు చప్పట్లు కొట్టారు.

చంద్రబాబుకు తాను మట్టి, నీరు అందిస్తున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు. కాగా, తన ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. తద్వారా ప్రత్యేక హోదాను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. అదే సమయంలో ప్యాకేజీని తేల్చలేదు. నీతి అయోగ్ నివేదిక రూపొందించనందున ప్యాకేజీ గురించి ప్రకటించలేదని సమాచారం.
ఇరు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఏపీ, తెలంగాణలకు సహకరిస్తామన్నారు. చంద్రబాబు - మోడీ జోడీ ఏపీ ప్రజల కల నెరవేరుస్తుందని చెప్పారు. ఏపీ మున్ముందు ఆర్థికంగా నిలదొక్కుకుంటుందన్న విశ్వాసం ఉందని చెప్పారు.
కాగా, ప్రధాని మోడీ ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి మాట్లాడక పోవడంపై అప్పుడే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి మట్టి, నీరు తెచ్చారు. అయితే హోదా, ప్యాకేజీల గురించి మాట్లాడకుండా కేవలం పవిత్ర మట్టిని, నీటిని తెచ్చానని చెప్పడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications