లాక్డౌన్: రిపోర్టులతో జగన్, కేసీఆర్ రెడీ.. సీఎంలతో ప్రధాని మోదీ కాన్ఫరెన్స్..
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు కనీసం 1500కు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి మొత్తం కేసుల సంఖ్య 26,917కే చేరింది. మరణాల సంఖ్య 826కు పెరిగింది. కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు ముంచుకొస్తున్నా.. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో పొడగింపు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ కు ప్రధాన్యం ఏర్పడింది.
ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, టెస్టులు నిర్వహిస్తున్న తీరు, లాక్ డౌన్ అమలులో ఇబ్బందులతోపాటు ఆర్థిక పరమైన అంశాలనూ ప్రధాని మోదీ ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ సీఎంలు ఇప్పటికే తమ రిపోర్టులు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కరోనా కట్టడి చర్యలతోపాటు లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ పైనా సీఎంలతో ప్రధాని చర్చిస్తారు. వ్యవసాయ పనులకు మరింత ఊతమిచ్చేలా లాక్ డౌన్ నిబంధనలు మరికొన్నింటిని సడలించాలని సీఎంలు కోరే అవకాశముంది. అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై కేంద్రం ఏం చెబుతుందనేది ఆసక్తిగా మారింది.
మే 3 తర్వాత(తెలంగాణలో మే 7 తర్వాత) కూడా లాక్ డౌన్ కొనసాగించే విషయమై నిపుణులు, సైంటిస్టులు రెండుగా చీలిపోయిన సందర్భంలో ప్రభుత్వాధినేతలు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. వైరస్ తగ్గేదాకా లాక్ డౌన్ కొనసాగించడం 'ఎలుక కోసం ఇంటిని తగులబెట్టిన' సామెతలా ఉంటుందని కొందరు వాదిస్తుంటే, వ్యాప్తి అదుపులోకి రాకుండే లాక్ డౌన్ ఎత్తేస్తే ఇప్పటిదాకా పడిన శ్రమంతా వృధా అయిపోతుందని, మరికొంత కాలం ఓపిక పట్టడమే మంచిదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా లాక్ డౌన్ ప్రకటన వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కావడం ఇది మూడోసారి. సోమవారం ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభం కానుందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.
Recommended Video