పోలవరంపై కేసీఆర్ షాక్: అనుకున్నదొక్కటి.. బాబుకు వరుస షాక్లు! టీడీపీపై బీజేపీ భగ్గు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు.. కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారని, తమ పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తున్నారని ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ముఖ్యంగా అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడులు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. అసలు విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదంటున్నారు. కేంద్రం ఏం చెప్పిందో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.

చంద్రబాబు చెబుతున్నా అదే విధంగా
ఓ వైపు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో దోస్తీ అంటూనే, మరోవైపు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీపై ఆచితూచి మాట్లాడాలని చంద్రబాబు నేతలకు పదేపదే చెప్పినా వారు అలా మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు.

చంద్రబాబు తీరు కూడా
అంతేకాదు, బీజేపీపై ఆచితూచి మాట్లాడాలని చెప్పిన చంద్రబాబు అసలు ఆయననే దానిని పాటించలేదని కమలం పార్టీ నేతలు గుర్రుమంటున్నారు. పార్టీలో అంతర్గతంగా బీజేపీపై ఇష్టారీతిన విమర్శలు చేసి, ఆగ్రహం వ్యక్తం చేసి, ఆ తర్వాత పార్టీ నేతలకు హితోపదేశం చేయడం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు.

టీడీపీ కావాలనే చేస్తోందా
టీడీపీ నేతల తీరు చూస్తుంటే బీజేపీపై కావాలనే విమర్శలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఒంటరి పోరు, టీడీపీతో కలిసి వెళ్లడంపై తమ పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కావాలనే బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

అసలు విషయం చెప్పడంతో బాబుకు రివర్స్
పోలవరం ప్రాజెక్టులు ఆపమని కేంద్రం లేఖ రాయలేదని ఆ విషయం తెలిసి కూడా టీడీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరమని బీజేపీ నేతలు అంటున్నారు. లేఖకు సమాధానం చెప్పకుండా తమ పార్టీని విమర్శించడంతో తాము అసలు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వారే చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. కాగా, బీజేపీకీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా అండగా నిలిచిన విషయం తెలిసిందే.

జేసీ దివాకర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
ఇదిలా ఉండగా, జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడులు పోలవరం విషయంలో కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు ఆదివారం ఆందోళన చేపట్టారు. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద అయ్యన్న, జేసీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతల విష ప్రచారం ఆపాలన్నారు.

చంద్రబాబుకు వరుసగా షాక్లు
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు బీజేపీపై తొలుత విమర్శలు గుప్పించారు. కానీ అది ఆయనకే ఎదురు తిరిగిందని అంటున్నారు. అసలు ఏం జరిగిందో బీజేపీ నేతలు చెప్పడం, కేంద్రం చేసిన దాంట్లో తప్పేముందని వైసీపీ ప్రశ్నించడంతో చంద్రబాబుకు రివర్స్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బాబుకు కేసీఆర్ ప్రభుత్వం ఝలక్
మరోవైపు, తెలంగాణ కూడా పోలవరం విషయంలో చంద్రబాబుకు షాకిచ్చింది. ఈ ప్రాజెక్టును ఒడిశా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో తాము ఒడిశా వెంటే ఉంటామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. తద్వారా చంద్రబాబుకు కేసీఆర్ ప్రభుత్వం కూడా షాకిచ్చిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications