ఫేస్బుక్ మోసగాడు: ఆడ గొంతుతో మగవారికి టోకరా, యువకుడు బలి
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో 50 మంది యువతులను తన తియ్యటి గొంతుతో వలలో వేసుకుని నిండా ముంచిన ఓ మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... కడప జిల్లా ఖాజీపేటలో టీకొట్టు నడుపుకొంటున్న నరసింహ వరప్రసాద్ టీ కొట్టు నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
ఖాళీ సమయాల్లో ఫేస్బుక్ చూసేవాడు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన గోర్ల నాగభూషణం 'అనుశ్రీ' పేరుతో ఫేస్బుక్ ఖాతా నిర్వహిస్తూ... వరప్రసాద్కు 'ఫ్రెండ్' అయ్యాడు. నాగభూషణం మిమిక్రీ కళాకారుడు. ఫోన్లో అచ్చం అమ్మాయిలాగా మాట్లాడుతూ వరప్రసాద్తో పరిచయం పెంచుకున్నాడు.
దీంతో వరప్రసాద్ ఆ మోసగాడి మాటలకు ముగ్దుడయ్యాడు. అంతేకాదు నాగభూషణం అమ్మాయేనని నమ్మాడు. ఇలా వీరిద్దరి ఫోన్ల సంభాషణ ఆర్ధిక లావాదేవీల వరకు వెళ్లింది. అడిగిన ప్రతిసారీ నాగభూషణం తల్లి గోర్ల కళ్యాణి అకౌంట్లో డబ్బు వేసేవాడు. చివరకు ఓసారి... 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని నాగభూషణం (అనుశ్రీ) అడిగాడు.
ఇందుకు నరసింహా వరప్రసాద్ సరేనని అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నాగభూషణం ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అలా కొన్ని రోజుల పాటు ఫోన్ కోసం ట్రై చేయగా ''నువ్వు నన్ను వేధిస్తున్నావని కేసు పెడతా'' అంటూ బెదిరించాడు. దీంతో నరసింహ వరప్రసాద్ భయపడి గత నెల 20వ తేదీ తన ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు.
తన చావుకు ఫేస్బుక్ ఫ్రెండ్ అనుశ్రీనే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో కడప జిల్లా ఖాజీపేట పోలీసులు నాగభూషణాన్ని అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 50 మందికి పైగా యువకులను నాగభూషణం మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఫేస్బుక్లో పరిచయమైన యువకులతో... తల్లి అనారోగ్యం, కళాశాల ఫీజులు, సెల్ఫోన్ అంటూ వివిధ కారణాలు చెప్పి రకరకాల అవసరాల కోసం డబ్బులు గుంజేవాడు. ఆ డబ్బుతో తాగుతూ, తింటూ జల్సా జీవితాన్ని గడుపుతుండేవాడు.