హైవే కిల్లర్ మున్నా ముఠా సభ్యుల అరెస్ట్ (ఫొటోలు)
ఒంగోలు: జాతీయ రహదారిపై మారణకాండకు పాల్పడిన మున్నా ముఠాకు చెందిన నలుగురు కీలక నిందితుల్ని ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టళ్లు, రెండు కత్తులు, తొమ్మిది బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రమోద్కుమార్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బెంగళూరుకు చెందిన మహమ్మద్ జమాలుద్దీన్, ఒంగోలు సత్యనారాయణపురానికి చెందిన ఎస్కె ఖాదర్బాషా, గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం ఉతమల్లి గ్రామానికి చెందిన తమ్మల సురేష్ , విశాఖపట్నానికి చెందిన కె అప్పలస్వామి నాయుడులను శుక్రవారం ఒంగోలులోని పోతురాజు కాలువ వద్ద అరెస్టు చేసినట్టు తెలిపారు. మహమ్మద్ జమాలుద్దీన్, ఎస్కె ఖాదర్బాషాలను అరెస్టుచేసి వారి వద్ద నుండి రెండు పిస్టల్స్, 9 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
తమ్మల సురేష్బాబు, కె అప్పలస్వామి నాయుడుల నుండి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మున్నా ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాకు చెందిన వ్యాపారి గంగాధర్రెడ్డి , నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాసులును హత్య చేసేందుకు పథకం పన్నినట్లు పోలీసులు వివరించారు. రైస్ పుల్లింగ్ వ్యాపారంలో కర్నూలు జిల్లాకు చెందిన గంగాధర్రెడ్డి, నల్గొండ వాసి శ్రీనివాసులు అధికంగా పెట్టుబడులు పెట్టి ఆ తరువాత డబ్బులు ఇవ్వమని మున్నా గ్యాంగ్పై వత్తిడి చేస్తుండటంతో వారిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు.
నిందితులు జనవరి 14న కర్నూలు జిల్లా లోని గంగాధర్రెడ్డిని హతమార్చాలనే పథకంలో భాగంగా కర్నూలుకు రాగా మున్నాను అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. ఆ సమయంలో మహమ్మద్ జమాలుద్దీన్, ఎస్కె ఖాదర్ బాషా, తమ్మల సురేష్బాబు, కె అప్పల స్వామి నాయుడు తప్పించుకెళ్లినట్లు తెలిపారు. అయితే పై నలుగురు నిందితులు మున్నా గురించి సమాచారం తెలియకపోవడంతో ఒంగోలు చేరుకుని అతని బంధువులను కలిసి సమాచారంతోపాటు కొంత డబ్బు తీసుకుందామని వచ్చి పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ వివరించారు.
మున్నా కరడుగట్టిన నేరస్థుడని, అతను మొత్తం 20 కేసుల్లో నిందితుడని తెలిపారు. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డిసి షీట్ నెంబర్ 741 ఉందని, మున్నా అతని అనుచురులు ప్రకాశం జిల్లాలో 13 మందిని హతమార్చి, ఇనుప లోడు లారీలను స్వాధీనం చేసుకుని ఇనుమును అమ్ముకున్న సంఘటనలపై కూడా పై నేరారోపణలు ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన స్థానిక పోలీసులను ఎస్పీ ప్రమోద్ కుమార్ అభినందించారు.