తుపాకీపై మోజుతో ఐసిస్లో చేరిన హైదరాబాద్ యువతి: వంటపని చేయించారని..
హైదరాబాద్: తుపాకీపై ఉన్న మోజుతో హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరింది. అక్కడే ఆమెకు తుపాకీ ఇవ్వకుండా వంటపని చేయించడంతోపాటు బానిసలా చూడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి కుటుంబసభ్యుల సహకారంతో తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు.
సుమారు రెండు నెలలపాటు ఆమె ఇరాక్లోని ఉగ్రవాదులతో కలిసి పని చేసింది. ఫేస్బుక్లో పరిచయమైన మహిళ ద్వారా ఆ యువతి ఐఎస్ఐఎస్లో చేరినట్లు తెలిసింది. బీటెక్ సెకండియర్ చదువుతున్న ఆ యువతి తుపాకీ మోజుతోనే ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలుస్తోంది. తుపాకీ ఇవ్వకుండా బానిసలా చూడటంతోనే ఆమె దోహాకు చేరుకుంది.

పోలీసులు, కుటుంబసభ్యుల సహకారంతో అక్కడ్నుంచి నుంచి ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకుంది. ఐఎస్ఐఎస్ గురించిన వివరాలను రాబట్టేందుకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఐసిస్లో చేరేందుకు బంగ్లాదేశ్ మీదుగా ఇరాక్ వెళ్లేందుకు యత్నిస్తున్న నలుగురు హైదరాబాద్ యువకులను పశ్చిమ బెంగాల్లో పోలీసులు పదిహేను రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. యువకులను తమ సంస్థవైపు ఆకర్షించేందుకు ఐసిస్.. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నట్టు నిఘా విభాగం అధికారులు చెబుతున్నారు.
ఐసిస్లో చేరడానికి యువతి శిక్షణ తీసుకోలేదు
హైదరాబాద్ యువతి ఐసీస్ చేరేందుకు ఎలాంటి శిక్షణ తీసుకోలేదని కమిషనర్ మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆమె గత పది సంవత్సరాలుగా ఖతార్లోనే నివసిస్తోందని ఆయన చెప్పారు. ఖతార్లో పరిచయమైన మరో యువతితో కలిసి ఐసీస్లో చేరేందుకు హైదరాబాద్ యువతి ప్రయత్నించిందని తెలిపారు. అయితే ఆ తర్వాత మనసు మార్చుకుని ఆమె తిరిగి వచ్చారని తెలిపారు. రెండు నెలల క్రితమే హైదరబాద్కు వచ్చినట్టుగా విచారణలో తేలినట్లు సీపీ మహేందర్రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications