దీప్తిపై దాడి కేసు:అర్ద్రరాత్రి ఆరుగురు రైతుల అరెస్ట్: చంద్రబాబు ఫైర్..!
రాజధానిలో రైతుల ఆందోళన సమయంలో..ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ దీప్తి తో సహా మరికొందరు జర్నలిస్టుల పైన దాడి ఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీప్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరుగురు రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆరుగురు రైతులను ఎంపిక చేసి అదుపులోకి తీసుకున్నారు. అర్ద్రరాత్రి రైతులను అదుపులోకి తీసుకొని తెనాలి తరలించారు. దీని పైన విపక్షాలు మండిపడ్డాయి. ఆందోళనకు దిగాయి. రైతులకు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. రైతుల అరెస్ట్ పైన టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని ఖండించారు. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా అని నిలదీసారు.
దీప్తి పై దాడి కేసులో రైతుల అరెస్ట్..
రాజధాని గ్రామాల్లో రైతుల నిరసన సమయంలో మీడియా రిపోర్టర్ల పైన దాడి జరిగింది. అందులో ప్రధానంగా గాయపడిన దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. మీడియా ప్రతినిధుల పైన దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి అభ్యర్ధించారు. మీడియా రిపోర్టలపైన దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇందులో పాల్గొన్న వారిగా గుర్తించిన ఆరుగురు రైతులను అర్ద్రరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి తెనాలి తరలించారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, వారి పైన నమోదు చేసిన సెక్షన్ల పైన విపక్షాలు మండిపడుతున్నాయి. మోదుగులింగాయపాలెం గ్రామానికి చెందిన బండారు నాగరాజు, ధనశ్రీ నరేష్, వెంకటపాలేనికి చెందిన గోగులపాటి సురేంద్ర, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, నెక్కల్లుకు చెందిన రామినేని నరసింహస్వామి, వెలగపూడికి చెందిన భూక్యా లోకానాయక్ను అరెస్టు చేశారు. ఆయా రైతుల ఇళ్ల గోడలు దూకి వెళ్లి మరీ పోలీసులు వారిని అరెస్టుచేసారని స్థానికులు చెబుతున్నారు.
రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఫైర్
రైతుల అరెస్ట్ ను టిడిపి అధ్యక్షుడ చంద్రబాబు ఖండించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని తప్పు బట్టారు. రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలని సూచించారు. భూములు కోల్పోయి.. రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా అంటూ నిలదీసారు.
నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయమని పేర్కొన్నారు. దొంగలు.. గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా అని ప్రశ్నించారు. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా అంటూ నిలదీసారు. రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా.. మహిళలు, వృద్దులను భయ భ్రాంతులను చేస్తారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
6 గురు రైతులపై 7సెక్షన్లు నమోదు చేస్తారా..
రాజధాని పరిధిలోని గ్రామాలకు చెందిన ఆరుగురు రైతుల పైన ఏడు సెక్షన్లు నమోదు చేస్తారా అంటూ చంద్రబాబు నిలదీసారు. అర్ధరాత్రి హడావుడిగా జైలుకు తరలిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం భూములు త్యాగాలు చేసిన రైతులపై ఇంత అమానుషమా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. 33వేల ఎకరాలు అందజేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లుగా ఎలా పిలుస్తారని ప్రశ్నంచారు. 13రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 6గురు రైతుల అరెస్ట్ అప్రజాస్వామికంగా అభివర్ణించారు. వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.