కావలిలో డ్రగ్స్ సరఫరా... అనుమానంతో పోలీసులు సోదాలు
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో కొమ్మరి కామేశ్వరమ్మ అనే మహిళ ఇంట్లో కావలి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 30 లక్షల 42వేల నగదు, 689 గ్రాముల బంగారం, 346 గ్రాముల వెండి, 2 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
కామేశ్వరమ్మ హైదరాబాదుకు ఎప్పుడూ కారులో రాకపోకలు సాగించడంపై డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానం వచ్చి ఆమె ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. డ్రగ్స్ ఏమీ దొరక్కపోడవంతో పోలీసులు ఆమెను స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు.
విచారణలో తనకు హైదరాబాదులోని నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి డబ్బులిస్తున్నట్లు చెప్పింది. దాంతో ఇంట్లో సోదాలు నిర్వహించి పైవాటన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు సహకరించిన డ్రైవర్ జవనీర్ ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్ ప్రసన్నాంజనేయులు, ఆమె కుమార్తె రమాదేవిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న డబ్బుని మండల ఎమ్మార్వోకు అప్పుజెప్తున్నామని, నిందితులను ఎమ్మార్వో వద్ద హాజరుపరచి తదుపరి విచారణ చేపడతామని కావలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు.