రామతీర్థంలో బీజేపీ దీక్ష భగ్నం... తెర పైకి కుట్ర కోణాలు... ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో...?
నిన్న,మొన్నటిదాకా ప్రశాంతంగా కనిపించిన ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సామాజిక చర్చలు,రాజకీయ విమర్శలు,ఆరోపణలన్నీ మతం,దేవుళ్ల చుట్టూ చేరాయి. రామతీర్థ ఘటనతో రాష్ట్ర రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని టీడీపీ,బీజేపీలు నిందిస్తుండగా... ఈ ఘటనల వెనుక టీడీపీ హస్తం ఉందని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. మున్ముందు రామతీర్థ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రామతీర్థంలో బీజేపీ నేతల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
తెల్లవారుజామున బీజేపీ నేతల అరెస్ట్...
రామతీర్థం కొలువైన బోడికొండ మెట్ల దిగువ భాగంలో దీక్ష చేస్తున్న బీజేపీ నేతలను ఆదివారం(జవనరి 3) తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి దీక్ష భగ్నమైంది. బీజేపీ రాష్ట్ర కార్యకర్గ సభ్యుడు ఈశ్వరరావుతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి వేరేచోటుకు తరలించారు. ఆదివారం మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,బొత్స సత్యనారాయణ పర్యటనల నేపథ్యంలోనే వీరి దీక్షను పోలీసులు భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోడికొండ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.
కుట్ర కోణాలు...?
మరోవైపు విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసంపై కుట్ర కోణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. డిసెంబర్ 30న ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం సీఎం వైఎస్ జగన్ విజయనగరంలో పర్యటించడానికి ఒకరోజు ముందు ఈ విగ్రహ ధ్వంసం ఘటన వెలుగుచూసింది. నిజానికి 28వ తేదీ రాత్రే దుండగులు రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ప్రచారం జరుగుతోంది. 29వ తేదీ ఆలయంలో సీసీటీవీని ఏర్పాటు చేస్తారనగా ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆ ప్రచారం ఫేక్...
రామతీర్థం ఘటన మరవకముందే కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని సజ్జలగూడెం సమీప పొలాల్లోని ఆంజనేయ స్వామి ఆలయంపై ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆ ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ ఫకీరప్ప అలాంటిదేమీ లేదని నిర్దారించారు. తప్పుడు ప్రచారంతో భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మొత్తంగా ఏపీలో విగ్రహాల ధ్వంసంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎక్కడికి దారితీస్తుందో...
వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు రాజకీయ లబ్ది కోసం టీడీపీ వేసిన ఎత్తుగడగా వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మతాన్ని,దేవుళ్లను కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తోంది. టీడీపీ మాత్రం ఇది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ఠ అని మండిపడుతోంది. ఇప్పటివరకూ ఏ దేవుడి విగ్రహ ధ్వంసం కేసులోనూ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తోంది. రామతీర్థం ఘటన తర్వాత ప్రత్యర్థి పార్టీలన్నీ వైసీపీని టార్గెట్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు మున్ముందుకు ఎక్కడికి దారితీస్తాయో... ఏ టర్న్ తీసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.