ఆందోళనతో ఇద్దరు ఎన్సిఎస్ షుగర్ డైరెక్టర్లు అరెస్ట్
హైదరాబాద్: గత కొన్నిరోజులుగా చెరకు రైతులు చెస్తున్న తిరుగుబాటు ఫలించింది. విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సిఎస్ షుగర్ ప్యాక్టరీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, మురళీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసి, ఆదివారం మధ్యాన్నం జిల్లా ఎస్పీ మందు ప్రవేశపెట్టారు.
బకాయిలు చెల్లించాలని చెరకు రైతులు గత కొన్ని రోజులుగా రోడ్డెక్కిన విషయం తెలిసిందే. శనివారం నాడు సీతానగరంలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఎన్సిఎస్ షుగర్ ప్యాక్టరీ యాజమాన్యం పదకొండు వేల మంది చెరకు రైతులకు 24 కోట్ల రూపాయిల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
దీంతో రైతులు ఆందోళన చేయడంతో... వారం రోజుల నుండి ప్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. గత వారంలో రైతులు షుగర్ ప్యాక్టరీ లోపలికి చొచ్చుకుపోయి.. ఆవరణలో ఉన్న యంత్రాలు, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా తమను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సోమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామన్నారు. ఏడాదిన్నర నుండి తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా పలుమార్లు యాజమాన్యం మమ్మల్ని వేధిస్తుందని తెలిపారు.
ఎన్సీఎస్ షుగర్స్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులను వేలం వేసి రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నాల్గు రోజుల క్రితం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. ఎన్ సీఎస్ షుగర్స్ ఫ్యాక్టరీకి చెందిన 75.11 ఎకరాల భూమిని స్వాదీనం చేసుకున్నారు. ఈ భూముల వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెరకు రైతుల బకాయిలు చల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 5-15వ తేదీల్లోగా బకాయిలు చెల్లిస్తామని హామీనిచ్చారు.