లాక్ డౌన్ పేరుతో ఏపీలో మీడియాపై పోలీసుల దాడులు.. బాధ్యులపై చర్యలు తప్పవన్న పేర్నినాని..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం సందర్భంగా విధించిన లాక్ డౌన్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇప్పటికే విజయవాడతో పాటు రాజమండ్రి, మచిలీపట్నంలో జర్నలిస్టులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్ధానిక విలేఖరులపై దాడి చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఏపీలో జర్నలిస్టులపై పోలీసుల దాదాగిరి..
కరోనా ప్రభావం నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను తొలుత లైట్ తీసుకున్న ఏపీ పోలీసులు.. ఆ తర్వాత మాత్రం జనంపై విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో న్యూస్ కవరేజ్ కు వెళుతున్న జర్నలిస్టులను కూడా వదలడం లేదు. ఇప్పటికే విజయవాడ, మచిలీపట్నం, రాజమండ్రిలో జర్నలిస్టులను అడ్డగించి మీడియా ఐడీ కార్డులు చూపిస్తున్నా వినకుండా దాడులకు దిగుతున్న పోలీసులు.. తాజాగా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మరోసారి విరుచుకుపడ్డారు.
కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన హనుమాన్ జంక్షన్ లో లాక్ డౌన్ వార్తలను కవర్ చేస్తున్న కొందరు జర్నలిస్టులను ఇవాళ ఏలూరు డీఎస్పీ అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించినా, విధుల్లో ఉన్నామని చెప్పినా వినకుండా లాఠీలతో చితక బాదారు. పలువురు జర్నలిస్టులకు గాయాలు కావడంతో వారు జాతీయ రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
దాడులపై ఏపీ సర్కారు సీరియస్..
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో లాక్ డౌన్ పేరుతో జర్నలిస్టులను డీఎస్పీ చితక బాదిన వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో డీజీపీకి మంత్రులు కొడాలినాని, పేర్నినాని ఫోన్ లో ఫిర్యాదు చేశారు. రిపోర్టర్లపై దాడికి పాల్పడిన ఏలూరు డీఎస్పీని సస్పెండ్ చేస్తామని, జర్నలిస్టులు నిరసన విరమించాలని మంత్రి పేర్నినాని కోరారు. దీంతో వారు వెనక్కి తగ్గారు. అటు హనుమాన్ జంక్షన్ దాడిపై డీజీపీ గౌతం సవాంగ్ కూడా సీరియస్ అయ్యారు. ఏలూరు రేంజ్ డీఐజీకి ఫోన్ చేసిన సవాంగ్.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Recommended Video
ప్రధాని, ముఖ్యమంత్రుల మాటా లెక్కలేదు..
ఓవైపు కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రధాని, ముఖ్యమంత్రులు సైతం ప్రశంసలు కురిపిస్తుంటే పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. డ్యూటీలో ఉన్న మీడియా ప్రతినిధులకు ఐడీ కార్డులు చూపిస్తే అనుమతించాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మీడియాను అడ్డుకోవద్దని పోలీసులకు పలుమార్లు సూచించారు. అయినా పోలీసులు మాత్రం లెక్క చేయడం లేదు. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నాయి.