ఎంపీ రఘురామపై హైదరాబాద్లో కేసు నమోదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఏపీకి చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్కే ఫరూక్భాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్ హిల్స్ వద్ద ఉండగా కారులో నలుగురు వ్యక్తులు వచ్చి, తనను బలవంతంగా ఎక్కించుకొని ఎంపీ రఘురామ ఇంటికి తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పర్సు, ఐడీ కార్డు కూడా లాక్కున్నారని తెలిపారు. కేసులో ఎంపీ రఘురామతోపాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ను నిందితులుగా చేర్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ భీమవరం పర్యటన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ రఘురామ హైదరాబాద్ వచ్చారు. నరసాపురం ఎక్స్ ప్రెస్లో బయలుదేరగా ఆ రైలు బోగీని తగలబెట్టి సత్తెనపల్లి వద్ద తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందంటూ బేగంపేట రైల్వేస్టేషన్లో దిగిపోయారు. తర్వాతరోజు ఉదయం గచ్చిబౌలి బౌల్డర్హిల్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని ఎంపీ అనుచరులు అదుపులోకి తీసుకొని ఇంటికి తెచ్చారు. అడుగుతున్న ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలిస్తుండటంతో అతణ్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి తాను ఏపీకి చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్నని, తన పేరు ఎస్కే ఫరూక్భాషా అని, రెండురోజుల క్రితమే 12 మంది రెండుకార్లలో హైదరాబాద్ వచ్చామని వెల్లడించారు.
ఆంజనేయులు అనే వ్యక్తి నుంచి ఫరూక్ కు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తాము అనుమానాస్పదంగా తిరుగుతుంటే ప్రశ్నించి పోలీసులకు అప్పగించామని రఘురామ అనుచరులు వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశారని భాషా ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి ఎస్ఐ సురేష్ తెలిపారు.