చంద్రబాబుపై జగన్ హయాం కేసులో కీలక పరిణామం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు పైన పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యారు. కాగా, నాటి కేసుల విషయంలో ప్రస్తుతం నిర్ణయాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పై అన్నమయ్య జిల్లా అంగళ్లులో అక్రమంగా బనాయించిన కేసులను పోలీసులు మూసివేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదించినట్లు సమాచారం.
అంగళ్లు కేసులో
వైసీపీ ప్రభుత్వ హాయంలో 2023 ఆగస్టులో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో వైసీపీ కేడర్ ప్రతిఘటించారు. దీంతో, ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ మద్దతు దారులు కురబలకోట మండలం అంగళ్లు సర్కిల్లో నడిరోడ్డుపై బైఠాయించారు. రాళ్లదాడులు జరిగాయి. చంద్రబాబు పైన రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదు. అయితే ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న చంద్రబాబుకు వినతిప్రతం ఇచ్చేందుకు తాము వెళ్తుంటే.. టీడీపీ నాయకులు తమపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని వైసీపీ ముఖ్యనాయకుడు ఉమాపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు పై కేసు
ఈ ఫిర్యాదు మేరకు అప్పట్లో ముదివేడు పోలీసులు చంద్రబాబుపై ఏకంగా హత్యాయత్నం (307) సహా పలు నాన్బెయిలబుల్ సెక్షన్లతో (క్రైం నంబర్లు 79/2023, 74/2023, 75/2023, 76/2023) నాలుగు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, అమరనాథ్రెడ్డి సహా 20 మంది క్రియాశీల టీడీపీ నాయకులపైనా కేసులు పెట్టారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు పోలీసులు.. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన వందల మంది టీడీపీ నేతల పైన కేసు నమోదైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఈ సంఘటన పూర్వాపరాలను పూర్తి స్థాయిలో విచారించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై బనాయించిన హత్యాయత్నం కేసుతో పాటు.. మిగిలిన మూడు కేసులూ తప్పుడువేనని తేల్చారు. వాటిని మూసివేస్తూ కోర్టుకు వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications