జగన్ ఎఫెక్ట్ : కోడెల తో సహా 22 మంది పై కేసు నమోదు: ఇసి..గవర్నర్ కు ఫిర్యాదు..!
స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు పై పోలీసులు కేసు నమోదు చేసారు. పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనిమెట్ల పోలింగ్ బూత్లో కోడెల రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ వైసిపి ఆరోపిస్తోంది. దీని పై వైసిపి అధినేత జగన్ రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. దీంతో..గుంటూరు జిల్లా పోలీసులు కోడెలతో సహా 22 మంది పైన ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
ఇనిమెట్లలో కోడెల పై దాడి..
స్పీకర్ కోడెల శివప్రసాద రావు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఇక , ఈ నెల 11న పోలింగ్ రోజున కోడెల నియోజకవర్గ పరిధిలోని ఇనిమెట్ల పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే, అక్కడకు వెళ్లగానే కోడెల తలుపులు వేసి రిగ్గింగ్ కు ప్రయత్నిస్తే..అక్కడ ఉన్న ఓటర్లు..గ్రామస్థులు అడ్డుకొని తరిమి కొట్టారని వైసిపి నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కోడెల మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇనిమెట్లతో వైసిపి రిగ్గింగ్ కు పాల్పడుతుందనే సమాచారంతో అక్కడికి వెళ్లగా..అక్కడే ఉన్న వైసిపి నేత లు..కార్యకర్తలు తన పై దాడి చేసారని చెబుతున్నారు. కానీ, టిడిపి నేతలు మాత్రం సానుభూతి కోసం కోడెల తన చొక్కా తానే చించుకొని డ్రామాలు ఆడారని అంటున్నారు. వైసిపి నేతల మీద టిడిపి, కోడెల మీద వైసిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
కోడెల పై కేసు పెట్టకుంటే దీక్ష చేస్తా..
తన పై దాడి చేయటానికి వైసిపి నేతలే కారణమంటూ కోడెల ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేసారు. వైసిపి సత్తెనపల్లి అభ్యర్ది అంబటి రాంబాబు తో సహా వైసిపి నేతలు నిమ్మకాయల రాజనారాయణ, లింగారెడ్డి పై కేసు నమోదు చేసారు. తమ పై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసారని..తమ ఫిర్యాదు ఆధారంగా కోడెల పై మంగళవారం సాయంత్రం లోగా కేసు నమోదు చేయకుంటే నిరహార దీక్షకు దిగుతానని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇదే సందర్భంలో వైసిపి నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కోడెల అంశం పై ఫిర్యాదు చేసారు. ఈ రోజు ఉదయం వైసిపి అధినేత జగన్ గవర్నర్ నరసింహన్ ను కలిసి కోడెల ఉదంతం పై ఫిర్యాదు చేసారు. కోడెల పై ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, వెంటనే గుంటూరు జిల్లా పోలీసులు కోడెల పై కేసు నమోదు చేసారు.
ఏడు సెక్షన్ల కింద కేసు..
కోడెల పై ఏడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు. కోడెల సహా మరో 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 131, 132, 188, 143, 341, 448, 506, ఆర్డబ్ల్యూ 149 తదితర ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజున జరిగిన హింస..ఆ తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల పై వైసిపి అటు కేంద్ర ఎన్నికల సంఘానికి..ఇటు గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం వైసిపి ఫిర్యాదుల పై సానుకూలంగా స్పందిస్తూ తమ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు టిడిపి సీనియర్ నేత కోడెల పై కేసు నమోదు చేయటం పై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.