కల్తీ మద్యం ఘటన: మల్లాది విష్ణుపై కేసు నమోదు చేసిన పోలీసులు
అమరావతి: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా వ్వవహరిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కల్తీ మద్యం ఘటనలో మల్లాది విష్ణుని 9వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. సెల్లార్లో బార్ నడుపుతున్నా ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం ఆగ్రహాం వ్యక్తం చేసింది. దీంతో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ఈ బార్కు అనధికారకంగా అనుమతులు తెచ్చుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు.
దీంతో మల్లాది విష్ణుపై కేసు నమోదు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కల్తీమద్యం ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 29మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రభుత్వం బెజవాడలోని వివిధ ఆసుపత్రుల్లో వారంతా చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తల్లి మల్లాది బాలాత్రిపురసుందరమ్మ, కుటుంబీకులు భాగవతుల శరత్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కావూరి లక్ష్మీసరస్వతిలపై ఐపీసీ 304 ఏ, 328, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ డీ(1),(2) కింద కేసు నమోదు చేశారు.
ఈ కల్తీ మద్యం ఘటనకు సంబంధించి ఎనిమిది సిబ్బందిని సోమవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కల్తీ మద్యం వల్ల చనిపోయారా లేక కిక్కుకోసం నీళ్ళలో ఇతరత్రా కెమికల్స్ కలపడం వల్ల చనిపోయారా అన్న కోణంలో విచారణ సాగుతోంది. కాగా, పోలీస్, ఎక్సైజ్ శాఖలు పరస్పర విరుద్ధమైన ప్రాధమిక నివేదికలు ఇచ్చాయి.
నీళ్ళలో ఇథనాల్ లేదా మరో రసాయనం కలవడం వల్లే తాగిన వాళ్ళు చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ మాత్రం బార్లో ఉన్న ఆఫీసర్స్ ఛాయిస్ బ్రాండ్ మద్యం నకిలీదని తేల్చింది. సోమవారం ఈ కల్తీమద్యం ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.
ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి విచారణ చేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. కృష్ణలంకలోని స్వర్ణ బార్ తన బంధువులది అయినప్పటికీ, ఈ ఘటనపై విచారణ జరపించాలన్నారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐదుగురి మృతికి కారణమైన ఈ ఘటనలో కల్తీ మద్యం కారణం కాదని ఆయన పేర్కొన్నారు. ఎవరో కావాలనే బార్కు చెందిన వాటర్ కూలర్లో ఏదో కలిపారని, అందుకే ఈ దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఈ ఘటన సంభవించడం తనకు కూడా చాలా బాధాకరంగా ఉందన్నారు.