ఊపిరి పీల్చుకున్న పవన్ కల్యాణ్ అండ్ కో..!!
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి పేరుతో చేపట్టనున్న బస్సు యాత్ర కోసం సన్నద్ధమౌతోన్నారు. త్వరలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్నారు. దీనికోసం ఆయన వారాహి పేరుతో ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్లో దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఈ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
లక్షలాది మంది అర్చకులకు జగన్ సర్కర్ గుడ్ న్యూస్: నూటికి నూరు శాతం
రణస్థలంలో..
బస్సు యాత్ర కంటే ముందు పవన్ కల్యాణ్ మరో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఆయన సారథ్యంలోని జనసేన పార్టీ- తాజాగా 'యువ శక్తి' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా- జనవరి 12వ తేదీన తొలి సభను నిర్వహించనుంది జనసేన పార్టీ. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం సమీపంలోని తాళ్లవలసలో ఈ సభ ఏర్పాటు కానుంది. ఉదయం 11 గంటలకు సభ ఆరంభమౌతుంది. దీనికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
యువ శక్తి పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలకు సంబంధించిన పోస్టర్ను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యువ శక్తి పేరుతో ఈ సభలను నిర్వహించ తలపెట్టినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకట్లేదని ఆరోపించారు.
పోలీసుల అనుమతి..
ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇటీవలే హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీఓ నంబర్ 1 కింద సూచించిన నిబంధనలకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈ యువ శక్తి సభ నిర్వహణకు అవసరమైన అనుమతులను మంజూరు చేశారు. రోడ్ షో నిర్వహణకు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే- రోడ్లపై బహిరంగ సభలను ఏర్పాటు చేయడానికీ అనుమతిని నిరాకరించరు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 వరకు సభ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నిబంధనలు ఇవీ..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్ల అనుమతి తీసుకుని అలాంటి ప్రదేశాల్లో బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం. అలాంటి సమయంలో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇచ్చే గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది. సభలు, ర్యాలీలను నిర్వహించే విషయంలో కొత్త మార్గదర్శకాలకు లోబడాల్సి ఉంటుందని నిర్వాహకులను హెచ్చరించింది.
సమయపాలన పాటించాల్సిందే..
బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే సమయంలో పోలీసులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వాహకులు సమయ పాలనను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దీనిపై లిఖితపూరక హామీని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. సభను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనేది స్పష్టం చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సభ ఉంటుందనే విషయాన్నీ పోలీసులు తెలియజేయాలి. ముందుగా సమర్పించిన రూట్ మ్యాప్ కు అనుగుణంగానే ర్యాలీలను చేపట్టాలి.