జేసీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు - అస్మిత్పైనా: తాడపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిపైనా పోలీసులు ఇదే కేసు పెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక టీడీపీ నాయకులు నిరసనలకు దిగడంతో పట్టణంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

వరుస పర్యటనలతో..
జేసీ ప్రభాకర్ రెడ్డి.. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో తాడిపత్రిలో వరుసగా పర్యటలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన కలియ తిరుగుతున్నారు. స్థానికులతో నేరుగా మాట్లాడుతోన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటోన్నారు. వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోన్నారాయన. స్థానిక నాయకులతోనూ వరుసగా భేటీ అవుతోన్నారు.

మూడోవార్డులో..
ఈ క్రమంలో- 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ- వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మూడో వార్డుకు చెందిన వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ భాషా-జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు, టీడీపీ నాయకులు వాదులాటకు దిగారు. స్థానిక కౌన్సిలర్ అయిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారంటూ వైసీపీ కౌన్సిలర్ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం కాస్తా రాళ్ల దాడికి దారి తీసింది. ఇరు వర్గాల వారు రాళ్ల దాడికి దిగారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు.

బాహాబాహీ..
రెండు పార్టీల నాయకులు, మద్దతుదారులు బాహా బాహీకి దిగారు. కాలనీల్లో అమర్చిన సీసీ కెమేరాలను సైతం వారు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదర గొట్టారు. ఘర్షణ జరిగిందనే విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మూడో వార్డుకు చేరుకోవడంతో అక్కడి పరిస్థితి మరింత ముదిరింది. దాడులు మళ్లీ మొదటికొచ్చాయి. ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వైసీపీ కార్యకర్తకు గాయాలు..
ఈ ఘటనలో వైసీపీకి చెందిన హాజీ భాషా అనే కార్యకర్త గాయపడ్డాడు. అతడి తలకు తీవ్ర గాయమైంది. మరికొందరు టీడీపీ, వైసీపీ నాయకులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్సం కోసం ఆసుపత్రికి తరలించారు. దీని తరువాత తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపారు. గాజులపాలెం వీధిలో తాడిపత్రి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అస్మిత్ రెడ్డితో కలిసి నల్లబ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. నల్లదుస్తులను ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు.

వారిద్దరిపైనా
కాగా గాయపడ్డ వైసీపీ హాజీ భాషా, అతని కుటుంబ సభ్యులు పోలీసులను కలిశారు. తనను హత్య చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, వారి అనుచరులు ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వారిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వారి అనుచరులు ఖాదర్ భాషా, అయూబ్తో మరి కొందరిపై ఐపీసీలోని సెక్షన్లు 147, 148, 307, 506, 149 కింద కేసు పెట్టామని వివరించారు.

స్పందించిన టీడీపీ..
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిపై హత్యాయత్నం కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. రౌడీ రాజ్యానికి ఇది నిదర్శనమంటూ మండిపడింది. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోన్నారని ధ్వజమెత్తింది.












Click it and Unblock the Notifications