విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు: కట్టుదిట్టంగా భద్రత: పూర్తి వివరాలివే..
విజయవాడ: దేశ గణతంత్ర వేడుకలకు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సమాయాత్తమౌతోంది. ఎప్పట్లాగే- విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీన్ని ఏర్పాటుచేసింది. ఈ వేడుకల కోసం ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ వేడుకలను ఘనంగా చేపట్టేలా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి జారీ చేసిన ప్రొటోకాల్స్కు అనుగుణంగా ఈ ఏర్పాట్లు సాగుతున్నాయి.
కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు పరిమితంగా మాత్రమే అహూతులను ఆహ్వానించే అవకాశం ఉంది. రిపబ్లిక్ పరేడ్కు సంబంధించిన రిహార్సల్స్ను ఈ సాయంత్రం నిర్వహించనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సహా పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు దృష్టిలో ఉంచరుకుని విజయవాడ పోలీసులు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ఆంక్షలను విధించిన ప్రాంతాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య గణతంత్ర దినోత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. బెంజ్ సర్కిల్ వైపు నుంచి మహాత్మా గాంధీ రోడ్డు వైపు వచ్చే వాహనాలను స్క్రూ బ్రిడ్జి, కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వైపునకు మళ్లిస్తారు. బెంజ్ సర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా జంక్షన్ వరకు వీఐపీల వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు.
అలాగే శిఖామణి జంక్షన్ నుంచి వెటర్నరీ కూడలి వైపునకు కూడా ఎలాంటి వాహనాలకు అనుమతించట్లేదని కాంతిరాణ టాటా తెలిపారు. ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి బెంజ్ సర్కిల్ వైపు వచ్చే అన్ని వాహనాలను రెండు వేర్వేరు మార్గాల్లో వైపు మళ్లించనున్నారు. ఆర్టీసీ వై జంక్షన్, కార్ల్ మార్క్స్ రోడ్, విజయా టాకీస్, చుట్టుగుంట, పడవల రేవు, రామవరప్పాడు మీదుగా మళ్లిస్తారు. మరొకటి- ఆర్టీసీ వై జంక్షన్, బందరు లాకులు, రాఘవయ్య పార్కు, కృష్ణలంక జాతీయ రహదారి, స్క్రూ బ్రిడ్జి మీదుగా వాహనాలను మళ్లిస్తారు.
Recommended Video
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకోనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చుట్టుపక్కల గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయనున్నారు. పలు మార్గాల్లో తనిఖీలను కూడా నిర్వహించే అవకాశాలు లేకపోలేదు.