నెల్లూరు కోర్టులో చోరీ - అదుపులో అనుమానితులు : మంత్రి కాకాని కేసు - టీడీపీ తాజా డిమాండ్..!!
ఏపీ రాజకీయాల్లో సంచలన అంశంగా మారిన నెల్లూరు కోర్టులో చోరీ కేసులో విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. కీలక కేసులో ఆధారాల చోరీతో జిల్లా ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. ఇదే సమయంలో ఈ ఘటన పైన ప్రతిపక్ష టీడీపీ రాజకీయంగా విమర్శలు చేస్తోంది. ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుని.... బయట తిరుగుతున్న నిందితుల బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. కోర్టులో దొంగతనం జరగటం..ఓ కీలకమైన కేసులో ఆధారాలుగా ఉన్నపత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగిలించడంతో ఇది సంచలనంగా మారింది.
కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల కేసును ఛేదించడం కష్టమైనా కోర్టుకు వెళ్లే దారిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇక, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసు అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు ఈ వ్యవహారం పైన రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కోర్టులో చోరీని తేలిగ్గా తీసుకోరాదని, ఈ విషయంపై గట్టిగా పోరాడాలని తెదేపా నేతలు నిర్ణయించారు.

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ1గా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు దొంగిలించడంపై సమగ్ర విచారణ జరపాలంటూ పోలీసుల్ని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. గతంలో తన కుటుంబసభ్యులకు ఇతర దేశాల్లో ఆస్తులున్నాయంటూ కాకాణి నకిలీ పత్రాలు సృష్టించారని గుర్తుచేశారు.
తాను దాఖలు చేసిన ఈ కేసులో శిక్ష పడుతుందని సాక్ష్యాలు చోరీ చేశారని వివరించారు. మంత్రిగా ఉన్న వ్యక్తి నిందితునిగా ఉన్న కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగి నిందితులకు శిక్ష పడితేనే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని పయ్యావుల పేర్కొన్నారు. మూడునెలల క్రితమే ప్రభుత్వం మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై నకిలీ పత్రాల కేసు ఉపసంహరించుకోవాలని ప్రయత్నించి భంగ పడిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. కోర్టులో జరిగిన చోరీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. కేసులో కీలక ఆధారాలైన పత్రాలు, సెల్ఫోన్లు, ల్యాప్టా్పను కొట్టేసిన కేటుగాళ్లు, వారి వెనక ఉన్న క్రిమినల్స్ని కఠినంగా శిక్షించాలని లోకేష్ కోరారు.












Click it and Unblock the Notifications