సుజనాకు-సీఎం రమేశ్ కు మాటల్లేవా? : ఏంటీ 'ఎడమొహం-పెడమొహం'
విజయవాడ : అవకాశవాదం.. ఆధిపత్య ధోరణి.. రాజకీయాల్లో ఈ రెండింటిని అస్త్రాలుగా మలుచుకునే నేతలు చాలామందే ఉంటారు. సంధు దొరికితే సన్నిహితుడినైనా సరే పదవి నుంచి దించేసి.. ఆ పదవిలో తాము పాగా వేయాలని ప్రయత్నిస్తారు. ఇదే తరహా ధోరణి వల్ల.. ఏపీ ఎంపీలైన సుజనా చౌదరి-సీఎం రమేశ్ మధ్య ఇప్పుడు మాటల్లేకుండా పోయాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా మారిన అంశం 'కేంద్రమంత్రి పదవి'. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో మరో దఫా సుజనా చౌదరికి అవకాశం ఇవ్వడం.. మంత్రిగా మళ్లీ సుజనా స్థానాన్ని పదిలపరుచుకోవడం సీఎం రమేశ్ కు ఏమాత్రం రుచించడం లేదన్నది వీరిద్దరి మధ్య వివాదానికి ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు.
సుజనాకు మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వకపోతే.. సుజనా వద్ద ఉన్న కేంద్రమంత్రి పదవి తనను వరిస్తుందని ఆశపడ్డారట సీఎం రమేశ్. అంతేకాదు.. ఇందుకోసం ఢిల్లీ బీజేపీ పెద్దల వద్ద ఆయన చాలా ప్రయత్నాలే చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానంకు తెలియకుండా సుజనా ఆర్థిక అవతకవకలకు సంబంధించిన నివేదికలన్నింటిని బీజేపీ పెద్దలకు చేరవేశాడన్న ఆరోపణ కూడా వినిపిస్తోంది. ఆ తర్వాత సుజనాకు టీడీపీ మరోసారి రాజ్యసభ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, మొత్తం వ్యవహారమంతా అధినేత చంద్రబాబు దృష్టికి రావడంతో.. ఇద్దరినీ గట్టిగానే మందలించినట్లుగానే తెలుస్తోంది. తనకు తెలియకుండా.. బీజేపీ పెద్దలతో తెర వెనుక ఇంత తతంగం నడపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారట చంద్రబాబు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడి పార్టీ పరువు తీయొద్దని గట్టిగానే హెచ్చరించాట.
అధినేత ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఈ ఇద్దరి మధ్య వ్యవహార శైలిలో ఏ మార్పు రాలేదన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కలిసి పనిచేయడం కాదు కదా.. ఇద్దరి వ్యవహారం ఇంకా ఎడమొహం పెడమొహంగానే ఉందన్న చర్చ జరుగుతోంది.