APలో ప్రశాంత్ కిషోర్ Vs ప్రశాంత్ కిషోర్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం యుద్ధాన్ని పోలిన వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు జనసేన కూడా దూకుడుగా రాజకీయం చేస్తుండటమే కారణం. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించిందంటే అందులో ఆ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో ఉంది.

నరేంద్రమోడీతో వెలుగులోకి పీకే
'ఐప్యాక్ ' పేరుతో సంస్థను నెలకొల్పి రాజకీయ పార్టీలకు సలహాలు, సూచనలిస్తూ ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకురావడమే పీకే పని. నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయడంతో వెలుగులోకి వచ్చిన పీకే తర్వాత డీఎంకే, తృణమూల్, వైసీపీ తదితర పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన 'జనసురాజ్' పేరుతో బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ చివరిసారిగా తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. అయితే టీఆర్ఎస్ కు, పీకే కు పొసగకపోవడంతో ఆయన తప్పుకున్నారు.

పీకే లేకున్న ఐప్యాక్ పనిచేస్తుంది!
వ్యక్తిగతంగా పీకే లేకపోయినప్పటికీ అవసరమైన రాష్ట్రాల్లో, ఒప్పందం కుదుర్చుకున్న పార్టీలకు 'ఐప్యాక్' పనిచేస్తోంది. అయితే ఆయన నేరుగా ఇన్వాల్వ్ అవరు. ఏపీలో రుషిరాజ్ నేతృత్వంలోని 'ఐప్యాక్' వ్యూహాలను సమకూరుస్తోంది. ప్రజలందరికీ వివిధ పథకాలద్వారా ప్రజలకు ఎంతెంత నగదు అందజేస్తోంది? భవిష్యత్తులో ఏ పథకాలు రాబోతున్నాయో ప్రజలకు ప్రజాప్రతినిధులే స్వయంగా తెలియజేసేందుకు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరుతో ఇంటింటికీ తిరుగుతున్నారు.

రాబిన్ సింగ్ 'ఇదేం ఖర్మ'
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాబిన్ సింగ్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన రాబిన్ సింగ్ సొంతంగా సంస్థ పెట్టుకొని టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవలే ఆయన్ను పార్టీ నేతలందరికీ చంద్రబాబు పరిచయం చేశారు. ప్రస్తుతం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ 'ఇదేం ఖర్మ' పేరుతో కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనిద్వారా టీడీపీ నాయకులంతా ఇంటింటికీ తిరుగుతూ వైఎస్ జగన్ రాకముందు ఏపీ పరిస్థితి, వచ్చిన తర్వాత ఎలా ఉంది? పన్నులు వేయడంతోపాటు ప్రజల్ని తాకట్టుపెట్టి లక్షల కోట్లరూపాయల అప్పులు చేశారంటూ చెబుతుండటమే 'ఇదేం ఖర్మ' ఉద్దేశం. రుషిరాజ్ వ్యూహానికి విరుగుడుగా రాబిన్ సింగ్ దీన్ని రూపొందించారు. ఇరు పార్టీలకు ప్రశాంత్ కిషోర్ శిష్యులే సలహాలు అందిస్తుండటం విశేషం. అందుకే ఏపీలో పరిస్థితి టీడీపీ వర్సెస్ వైసీపీ కాకుండా ప్రశాంత్ కిషోర్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications