బాలకృష్ణ హాట్ కామెంట్స్ తో హిందూపురంలో హీట్ ; బాలయ్యకు అదిరిపోయేలా వైసీపీ ఎమ్మెల్సీ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల తీర్పు ఏకపక్షంగా రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలలో ఆందోళన కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్నా, పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఆందోళనలు కొనసాగిస్తున్నా, ప్రజలలో మాత్రం వ్యతిరేకత లేదన్నది ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలోనూ వైసీపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి దూకుడు చూపిస్తుంది. టీడీపీ ఊహకు అందని విధంగా పరాజయాలను, పరాభవాలను మూటగట్టుకుంటుంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
72 వేల కోట్ల హెరాయిన్ వెనుక తాడేపల్లి బిగ్ బాస్; ఏపీ మద్యంలోనూ ఆ డ్రగ్స్ : బోండా ఉమ సెన్సేషన్
హిందూపురంలోనూ పరిషత్ ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ
తాజాగా పరిషత్ ఎన్నికల తీర్పు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడం తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి తగిలిన షాక్ పార్టీ శ్రేణులలోనూ, ప్రజలలోనూ చర్చనీయాంశం అయ్యింది. ఏకంగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ, హిందూపురంలోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించటం, టీడీపీకి గట్టి దెబ్బ తగలటంతో, తాజా పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నాయకులలో ఒకింత నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఇక బాలయ్య నియోజకవర్గంలో టీడీపీ ఏడు ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది. కుప్పంలో చంద్రబాబు కేవలం 3 ఎంపీటీసీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
హిందూపురంలో టీడీపీలో చేరికలు ..పార్టీ కార్యకర్తలకు బాలయ్య దిశా నిర్దేశం
ఇక హిందూపురం నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఈ క్రమంలో పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో బండ్ల కొండయ్య అనే వ్యక్తి టిడిపిలో చేరారు. ఆ సమయంలో హిందూపురం ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన సంభాషణను ఆయన పార్టీ కార్యకర్తలందరికీ వినిపించారు. ఏపీలో మళ్ళీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ ఉద్వేగంగా చెప్పారు. పార్టీలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని అందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
బయటకు వచ్చాక అందరి సంగతి తేలుస్తా .. బాలయ్య ఆడియో వైరల్
తాను చేస్తున్న సినిమా విడుదలైతే, బయటకు వచ్చిన తర్వాత అందరి సంగతి చూస్తానంటూ బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో, చంద్రబాబు ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సైనికులుగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలలో బాలయ్య జోష్ నింపే ప్రయత్నం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదని బాలయ్య విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడంలేదని, పెట్టుబడి పెట్టే వారే లేరని పరిస్థితి దారుణంగా ఉందని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, వేధిస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఖచ్చితంగా అందరి సంగతి తేలుద్దాం అన్నారు బాలయ్య. టిడిపి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలని బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు.
బాలకృష్ణ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్
ఇక బయటకు వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తా అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ, హిందూపురం ఇన్చార్జి ఇక్బాల్ బాలకృష్ణ కు సవాల్ విసిరారు .వరుసగా ఓటమి పాలు అవుతుండటంతో బాలకృష్ణ కి ఏం చేయాలో అర్థం కావడం లేదని, ఓటమిని జీర్ణించుకోలేక ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ కు దమ్ముంటే హిందూపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీ పడాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో తాను ఓటమి పాలైతే రాజకీయాల నుంచే కాదు, హిందూపురం నుండి కూడా శాస్వతంగా వదిలి వెళ్ళిపోతానని ఇక్బాల్ చాలెంజ్ చేశారు.
ఓటమి కారణాలు చూడకుండా , సమర్ధించుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ
వరుస ఓటములతో టిడిపి కుదేలవుతుందని, ప్రజలు తెలుగుదేశం పార్టీ అభాసుపాలవుతోంది అని ఇక్బాల్ పేర్కొన్నారు. కుప్పం, హిందూపురం సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి పాలైనా, అసలు టిడిపి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా, సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇక్బాల్ ఎద్దేవా చేశారు. ఓటమి మిగిల్చిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఏడు ఎంపీటీసీలు తప్ప మిగిలినవన్నీ వైసిపి కైవసం చేసుకుందని ఇక్బాల్ పేర్కొన్నారు అన్ని ఎన్నికలలో ఓడిపోతున్న కారణంగా చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ డ్రామాలాడుతున్నారని ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 జిల్లా పరిషత్తు లను కైవసం చేసుకుంది. పరిషత్ ఎన్నికల లెక్కింపు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 86% ఎంపీటీసీ సీట్లు, 98 శాతం జడ్పిటిసి సీట్లు వచ్చాయని, తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ భయం మొదలైందని వైసీపీ నేతలు విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ప్రజలు ఏకపక్షంగా జగన్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పుకుంటున్నారు. ఎన్నికలు ఏవి జరిగినా గెలిచేది మాత్రం వైసీపీనే అని నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది.