నచ్చకుంటే ఇబ్బంది పెట్టడం అలవాటే: వెంకయ్య, ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నాం
న్యూఢిల్లీ/విశాఖ: తనకు నచ్చని వాళ్లని ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు అన్నారు. ప్రజల తీర్పుతో అసహనానికి గురైన కాంగ్రెస్ పార్టీ.. నరేంద్ర మోడీ ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతోందన్నారు.
అందుకే ఎన్డీయే ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని అవార్డు వాపసీ పేరుతో అనవసర రాద్ధాంతం చేసిందన్నారు. అసహనం పేరుతో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు.
రాజకీయ తాత్కాలిక అవసరాల కోసం కుల, మత శక్తులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందన్నారు. పారిస్లో ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా ఖండిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మతం రంగు పులుముతోందన్నారు. మతం పేరుతో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్లో చర్చ జరుగుతోందని, నివేదిక వచ్చాక ముందుకెళ్లే అకాశముందన్నారు. గృహ నిర్మాణాల మంజూరులో ఏపీకి ప్రయోజనం చేకూర్చామన్నది నిజం కాదన్నారు. పట్టణ పేదల గృహ నిర్మాణాల కోసం ఏపీ ముందే నివేదిక పంపిందని స్పష్టం చేశారు. ఏపీ ఇచ్చిన నివేదిక మేరకే రాష్ట్రానికి లక్షా 90వేల గృహాలు మంజూరయ్యాయన్నారు.