జగన్ కు సాయపడటం కంటే - ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..!!
రాజకీయ వ్యూహకర్త .. జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్ 2014 ఎన్నికల సమయం నుంచి తాన రాజకీయ వ్యూహకర్తగా అందించిన సేవలు..గుర్తించిన అంశాల పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి..బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారు తమ లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు తాను సాయపడిన విషయాన్ని గుర్తు చేసారు. అదే సమయంలో వారికి సాయపడటం కంటే కాంగ్రెస్ పునరుజ్జీవానికి తాను కృషి చేసుంటే బాగుండేదని కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలుసుకోవటానికి చాలా కాలం పట్టింది
గాడ్సే సిద్ధాంతాన్ని ఎదుర్కోవాలంటే అదొక్కటే మార్గమని చెప్పుకొచ్చారు. గాంధీ కాంగ్రెస్ పునరుజ్జీవంతోనే ఓడించగలమని తెలుసుకోవడానికి తనకు చాలాకాలం పట్టిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయ యాత్రను అడ్డుకోవటంలో విపక్షాల కూమటి సమర్ధతపైన ప్రశాంత్ కిషోర్ సందేహాలు వ్యక్తం చేసారు. బీజేపీ అసలు ఏంటనేది అర్దం చేసుకోకుండా, ఆ పార్టీని ఓడించలేరని విశ్లేషించారు. కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి. ఓ కాఫీ కప్పులో పైన ఉండే నురుగు బీజేపీ అయితే, అసలు కాపీ ఆరెస్సెస్ అని..అది సమాజంలోకి చొచ్చుకెళ్లిందని పీకే చెప్పుకొచ్చారు. దానిని ఓడించటానికి దగ్గర దారులు ఏమీ లేవని అభిప్రాయపడ్డారు.

2019లో వైసీపీకి వ్యూహకర్తగా సేవలు
సామాజిక వ్యవస్థలో ఆరెస్సెస్ భాగమైపోయిందని వ్యాఖ్యానించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రచార నిర్వహణను విజయవంతంగా చేపట్టి పీకే తొలిసారి వెలుగులోకి వచ్చారు. అయితే ఆయన ప్రధాని అయ్యాక సంబంధాలు తెంచుకుని బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్కుమార్తో చేతులు కలిపారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేసి విజయపథంలో నడిపారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో అమరీందర్ గెలుపుకు దోహదం చేసారు. 2019 ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించారు. వైసీపీ ప్లీనరీకి హాజరయ్యారు.

జగన్ తో సత్సంబంధాలు - ఈ వ్యాఖ్యలతో
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పలు సందర్భాల్లో సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఐ ప్యాక్ వైసీపీకి రాజకీయ సేవలు అందిస్తోంది. కానీ, ఐ ఫ్యాక్ తో ప్రశాంత్ కిషోర్ కు ఎటువంటి సంబంధాలు లేవు. ఇప్పుడు తాను 2019లో జగన్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా అందించిన సేవల పైన ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. దీని పైన వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications